నారా లోకేష్ ఉత్సాహంపై చంద్రబాబు నీళ్లు: ఆదినారాయణ రెడ్డికి నో ఎంట్రీ
హైదరాబాద్: పార్టీలోకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప జిల్లా జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డిని తీసుకోవాలనే ఆలోచన నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. జగన్ సొంత జిల్లా కడప నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి వస్తున్న ఆదినారాయణ రెడ్డి రావడం తమకు ఉపకరిస్తుందని, జగన్పై ఆధిక్యత సాధించవచ్చునని భావించిన పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉత్సాహంపై చంద్రబాబు నీళ్లు చల్లుతారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది.
కడప జిల్లా జమ్మలమడుగు తెలుగుదేశం ఫార్టీ ఇంచార్జీ రామసుబ్బారెడ్డి మాటలను బట్టి చంద్రబాబు ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకోకపోవచ్చునని అర్థమవుతోంది. కడప జిల్లాకు, ఆదినారాయణ రెడ్డికి కాంబినేషన్ కుదరదని తాను చెప్పానని, చంద్రబాబు ఈ విషయంపై తనకు హామీ ఇచ్చారని రామసుబ్బా రెడ్డి శనివారంనాడు చెప్పారు.

ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడి వరకు తాను విధేయుడిగా ఉన్నానని, తన కుటుంబమంతా పార్టీకి విధేయంగా ఉందని రామసుబ్బారెడ్డి చెప్పారు. ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచనను రామసుబ్బారెడ్డి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆది నారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని ఆయన శుక్రవారం నారా లోకేష్కు, బాలకృష్ణకు కూడా చెప్పారు.
జగన్ సొంత జిల్లా నుంచి ఒక నాయకుడు రావడం మనకు కలిసి వస్తుందని నారా లోకేష్, బాలకృష్ణ రామసుబ్బారెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, రామసుబ్బారెడ్డి అంతటితో ఆగకుండా చంద్రబాబును కలిశారు.
కాగా, తెలుగుదేశం పార్టీలో చేరాలనే ఆదినారాయణ రెడ్డి ఆలోచనకు జమ్మలమడుగులో ఆయన వర్గం నుంచి కొంత వ్యతిరేకత ఎదరువుతున్నట్లు కూడా తెలుస్తోంది. పార్టీ మార్పుపై ఆయన తన సోదరులను ఒప్పించేందుకు ప్రయత్నాలు సాగించినట్లు చెబుతున్నారు. తన స్వగ్రామం దేవగుడిలో ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications