నారావారిపల్లెలో కోలాహాలం: కులదైవం సన్నిధిలో చంద్రబాబు, బాలయ్య.. మనవడి తలనీలాలు పూర్తి
అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లె ప్రముఖుల రాకతో కోలాహలంగా ఏర్పడింది. తన మనవడు దేవాన్ష్కు తలనీలాల తీయించేందుకు గురువారం సాయంత్రమే నారావారిపల్లెకు చేరుకున్న చంద్రబాబు శుక్రవారం ఉదయం 7 గంటలకు నాగాలమ్మ గుడికి చేరుకున్నారు.
ముందుగా నాగాలమ్మతల్లి కట్ట చుట్టూ చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి ప్రదక్షిణలు చేశారు. అనంతరం కులదైవం నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుల దైవమైన నాగాలమ్మ తల్లికి తన మనవడు దేవాన్ష్ పుట్టెంట్రుకలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి నారా, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
రెండు కుటుంబాల నుంచి సుమారు 25 మంది వచ్చినట్లు తెలుస్తోంది. వీరితో పాటు స్థానికులు 200 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు నారావారిపల్లె పర్యటన సందర్భంగా నాగాలమ్మ గుడి వద్ద అధికారులు చలవ పందిళ్లను ఏర్పాటు చేశారు.
నారా కుటుంబంతో పాటు ఆయన బావమరిది నందమూరి బాలకృష్ణ కుటుంబం కూడా ఒకేసారి గ్రామానికి రావడంతో నారావారిపల్లెలో సందడి వాతావరణం నెలకొంది. చంద్రబాబు కంటే ముందుగానే ఆయన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు, చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు సతీమణి ఇందిర, కోడలు నారా బ్రాహ్మణిలు చిన్నారి దేవాన్ష్తో కలిసి నారావారిపల్లెకు చేరుకున్నారు.
గురువారం సాయంత్రానికి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన సొంతూరు నారావారిపల్లె చేరుకున్నారు. నారావారిపల్లెలోని తన సొంతింటిలో గంట పాటు సేదదీరిన చంద్రబాబు, ఆ తర్వాత బటయకు వచ్చి గ్రామస్థుల నుంచి వినతులు స్వీకరించారు.