బాలయ్యతో శాతకర్ణి చూసిన బాబు: ఆ పేరు రామోజీరావు చెప్పారని...
బావా, బావమరుదులు విజయవాడ నగరంలో సందడి చేశారు. చిత్రం యూనిట్తో కలిసి వారిద్దరు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూశారు.
విజయవాడ: బావామరుదులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సినీహీరో, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గురువారం విజయవాడ నగరంలో సందడి చేశారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా విడుదలను పురస్కరించుకుని గురువారం రాత్రి క్యాపిటల్ సినిమాస్లో చిత్ర బృందంతో కలిసి చంద్రబాబు, బాలయ్య సినిమా చూశారు.
ఉదయం హైదరాబాద్లో సినిమా చూసిన బాలకృష్ణ సాయంత్రం విజయవాడలో ముఖ్యమంత్రి, చిత్ర యూనిట్తో కలిసి ప్రత్యేక షోను వీక్షించారు. హైదరాబాదులో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూడా వస్తారని అనుకున్నారు. కానీ ఆయన రాలేదు.
విజయవాడలో ముఖ్యమంత్రి సినిమా చూడటానికి వస్తున్నారని తెలుసుకున్న ప్రేక్షకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో చేరుకోవడంతో థియేటర్ వద్ద పండగ వాతావరణం చోటు చేసుకుంది. ముందుగానే పోలీస్ అధికారులు థియేటర్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, చిత్ర బృందానికి థియేటర్ యజమానులు ఘన స్వాగతం పలికారు.
రాత్రి 7.30 గంటలకు సినిమాకు వచ్చిన ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా 20సీట్లను అందుబాటులో ఉంచారు. అభిమానులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన సినిమా చూశారు. హీరోయిన్ శ్రీయ, డైరెక్టర్ క్రిష్, ఎంపీలు కేశినేని శ్రీనివాస్, కొనకళ్ల నారాయణ, మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్, చిత్ర బృందం పాల్గొన్నారు.
తెలుగు వారి చరిత్రను గుర్తుకు తెచ్చేలా, వారంతా గర్వించేలా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు. భారతీయులందరూ గర్వపడేలా, ఉత్తేజపరిచేలా ఈ సినిమా తీశారని అన్నారు. బాలకృష్ణ నటన అద్భుతంగా ఉందన్నారు. బాలకృష్ణ నటించిన ఎన్నో సినిమాలను తాను చూశానని, వాటన్నింటిలో శాతకర్ణి ప్రత్యేకంగా నిలిచిపోతుందన్నారు. సినిమాలో హేమమాలిని, శ్రియలు అద్భుతంగా నటించారన్నారు.
'ఈనాడు' ఛైర్మన్ రామోజీరావు ఎంతో పరిశోధించి ఏపీ రాజధానికి అమరావతి పేరు పెట్టాలని సూచించారని, ఆయన సూచనను ప్రతి ఒక్కరూ ఆమోదించినట్లు తెలిపారు. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా రూపొందిస్తామని చెప్పారు. కేవలం 79రోజుల్లో శాతకర్ణి చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తీయటం గొప్ప విషయమన్నారు. చిత్ర యూనిట్కు అభినందనలు తెలియజేశారు. చిత్ర కథానాయకుడు బాలకృష్ణ మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణానికి చిత్ర యూనిట్ తరపున రూ.3.5లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు.