హవ్వా.. చంద్రబాబు, అసెంబ్లీ మెట్లపై కూడానా, బిచ్చం అలవాటైనట్లుంది: మంత్రి కొడాలి నాని
Recommended Video
కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగాడు అన్నట్టు చంద్రబాబు నాయుడు జోలె పట్టుకొని అడగడంతో బిచ్చం అడగడం అలవాటైపోయిందని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. అమరావతి పరిరక్షణ సమితి యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజధాని అమరావతి ఉండాలని ఆయన జోలెపట్టుకొని నిధులు సేకరించిన తీరును మంత్రి కొడాలి నాని తప్పుపట్టారు. ఇటీవల అసెంబ్లీ వద్ద కూడా చంద్రబాబు నాయుడు జోలెపట్టుకున్నారని గుర్తుచేశారు.
అసెంబ్లీ మెట్లపై కూడా
సాధారణంగా బిచ్చగాళ్లకు మెట్లు కనిపిస్తే గుడ్డ పరిచి అడుక్కొంటారు. అలాగే అసెంబ్లీ మెట్ల వద్ద ఇటీవల చంద్రబాబు నాయుడు కూర్చొన్నారని కొడాలి నాని పేర్కొన్నారు. అక్కడ గుడ్డ వేసి చిల్లర అడుకున్నారని.. ఇది చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలు అని విమర్శించారు. టీడీపీ చేసినా, చేస్తోన్న పనులని చూసి ప్రజలు బొందపెట్టినా, కొన ఊపిరితో ఉన్న పార్టీకి 21 సీట్లలో మాత్రమే విజయం అందించారని గుర్తుచేశారు. అయినా ఆ పార్టీ నేతల్లో మార్పు రాలేదని విమర్శించారు.
తిన్నింటి వాసాలు..
విశాఖపట్టణానికి చెందిన వెలగపూడి రామకృష్ణపై మంత్రి కొడాలి నాని ఫైరయ్యారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం మీకు నచ్చలేదా ? ఎందుకు వెల్లోకి దూసుకొస్తున్నారని కొడాలి నాని ప్రశ్నించారు. మీరు కృష్ణా జిల్లాలో పెరిగి ఉండొచ్చు, ఇక్కడ ఆస్తులు ఉండొచ్చు.. పోటీ చేసి విజయం సాధించిన నియోజకవర్గాన్ని మరచిపోవడం మాత్రం దారుణమన్నారు. ఒక్కటి కాదు రెండు కాదు.. విశాఖ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తుచేశారు. అయినా అతనిలో కాసింత కృతజ్ఞత భావం లేదన్నారు.
కృతజ్ఞత మరచి
సచివాలయం అమరావతిలోనే ఉండాలా..? విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావొద్దా అని ప్రశ్నించారు. ఒక్కపూట అన్నం పెడితే కృతజ్ఞత చూపిస్తుంటాం.. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ఆ ప్రాంత ప్రజల మనోభావాలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అంతేకాదు గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కన్నా కూడా ఎక్కువ మెజార్టీతో ప్రజలు గెలిపించారని గుర్తుచేశారు. కానీ రామకృష్ణ మాత్రం తిన్నింటి వాసాలు లెక్కగట్టే రకం అని విమర్శించారు. ఆయన బుద్ధి, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.