జగన్ ఎప్పుడు ఏం రద్దు చేస్తారో తెలీదు..జగన్ కంటే బాబే నయం..మెగా బ్రదర్ నాగబాబు
Recommended Video
జనసేన నాయకుడు, నటుడు, మెగా బ్రదర్ నాగబాబు తాజా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ మాజీ సీఎం చంద్రబాబును పొగిడేశారు. గతకాలం మేలు ప్రస్తుత కాలం కంటే అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ కంటే చంద్రబాబే కాస్త బెటర్ అని చెప్పుకొచ్చారు నాగబాబు .
సీఎం జగన్ కంటే చంద్రబాబు పాలనలోనే ఏం జరుగుతుందో తెలిసేదన్న నాగబాబు
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలైన నాగబాబు జంగారెడ్డి గూడెంలో పర్యటించారు. ఈ క్రమలో జనసేన నేత నాగబాబు మాట్లాడుతూ చంద్రబాబు, జగన్లను పోలుస్తూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అర్ధం కాని పరిస్థితి నెలకొందని నాగబాబు ఆరోపించారు.సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలు అర్ధం కావటం లేదని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు పాలనలోనే ఏం జరుగుతుందో తెలిసేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు .
జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావాలన్న మెగా బ్రదర్
ఇక ఏపీలో బీజేపీతో జనసేన పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని చెప్పిన ఆయన భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని నాగబాబు అభిప్రాయపడ్డారు . రాష్ట్రాభివృద్ధే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ బీజేపీతో జతకట్టారని, రాష్ట్ర ప్రజల కోసం నిబద్దతతో పని చేస్తున్నారని నాగబాబు చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో అయినా చేసే పని ముందుగానే తెలిసేదని, ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమి చేస్తున్నారో ఎవరికీ అంతుచిక్కని విధంగా వుందని నాగబాబు వ్యాఖ్యానించారు.
జగన్ పాలనపై అసహనం వ్యక్తం
ఇక రాష్ట్రంలో వైసీపీ పాలనలో అభివృద్ధి పడకేసిందని,రాష్ట్రంలో రహదారులు చాలా అధ్వానంగా ఉన్నాయని నాగబాబు ఆరోపించారు. జగన్ ఎప్పుడు ఏమి రద్దు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందని నాగబాబు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్ల పరిస్థితి దారుణంగా చాలా దారుణంగా ఉందన్న నాగబాబు ఇక్కడి రోడ్ల మీద ప్రయాణం చేయడం కంటే హెలికాఫ్లర్లు కొనుక్కొని ప్రయాణించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అసహనం వ్యక్తం చేశారు .
అనుభవం లేదు.. ఎవరితోనూ చర్చించరు.. సీఎం జగన్ పై విసుర్లు
చంద్రబాబుకు అనుభవం ఉన్నా ప్రభుత్వ పరమైన నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయం తీసుకునేవారని నాగబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా ఏదైనా చేసే ముందు దానికి సంబంధించిన వివరాలను అనుభవజ్ఞులతో చర్చించి, తగిన విధంగా నిర్ణయం తీసుకోవడం మంచిది అని నాగబాబు అన్నారు. ఈ విధంగా చేయడంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా నయం అని నాగబాబు అభిప్రాయపడ్డారు.