బాబుని కన్నెత్తయినా చూడని మోడీ: కేజ్రీవాల్తో భేటీ, మధ్యాహ్నాం ప్రెస్ మీట్!
న్యూఢిల్లీ: పార్లమెంటు మలివిడుత సమావేశాలు మరో మూడు రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో.. ఏపీ ప్రధాన పార్టీలు రెండు వ్యూహాల్లో మునిగిపోయాయి. ఉదయాన్నే ఎంపీలతో భేటీ అయిన చంద్రబాబు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
Recommended Video
పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత రాష్ట్రంలోను, ఢిల్లీలోనూ ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని చంద్రబాబు ఎంపీలతో చెప్పినట్టు తెలుస్తోంది. వేలాది మంది కార్యకర్తలతో ఢిల్లీ వీధుల్లో పోరాటం చేసేందుకు సన్నద్దంగా ఉండాలని ఆయన చెప్పినట్టు సమాచారం. ఈరోజు మధ్యాహ్నాం 3గం.కు ఆయన మీడియా సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది.
కేజ్రీవాల్తో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్:
ఎంపీలతో భేటీ అనంతరం.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో ఆయన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. భేటీలో దేశ రాజకీయాలతో పాటు ప్రాంతీయ పార్టీల సమస్యలపై ఆయన చర్చించే అవకాశం ఉంది.
అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి బీజేపీ వెనకడుగు వేయడంపై కూడా ఆయన చర్చిస్తారని చెబుతున్నారు. ఆయా పార్టీల నేతలతో భేటీ ద్వారా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేశవ్యాప్తంగా అందరి దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు.
బాబుకు ఆదరణ చూసి ఆశ్చర్యపోయా: కొనకళ్ల నారాయణ
పార్లమెంటు మెట్లకు మొక్కడం కేంద్రంపై యుద్ద బావుటాను ఎగిరివేయడమేనని ఓ ప్రశ్నకు సమాధానంగా ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. చంద్రబాబు ఢిల్లీ వచ్చిన తర్వాత స్పష్టమైన మార్పు కనిపిస్తోందని చెప్పారు. జాతీయ స్థాయిలో ఆయనకు లభిస్తున్న ఆదరణ చూసి తాను ఆశ్చర్యపోయానని అన్నారు.
పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఆయా పార్టీల నేతలను కలిసి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఆయన వివరించారని అన్నారు. 'ఇవాళ మా రాష్ట్రం.. రేపు మీ రాష్ట్రానికి కూడా ఇదే పరిస్థితి రావచ్చు' అన్న చంద్రబాబు వ్యాఖ్యలతో చాలామంది ఏకీభవించారని, మద్దతు తెలిపేందుకు ముందుకు వచ్చారని పేర్కొన్నారు.
ఇది కేంద్రంపై తిరుగుబాటు
కేంద్ర మంత్రి పదవుల నుంచి తాము తప్పుకున్న తర్వాతే అసలైన పోరాటానికి నాంది పలికినట్టయిందని కొనకళ్ల అభిప్రాయపడ్డారు. ఇప్పటిదాకా అందరినీ ఒక్క తాటి పైకి తెచ్చే నాయకుడు లేకుండా పోయాడని, చంద్రబాబు ఢిల్లీ రాకతో ఆ లోటు తీరుతుందని అన్నారు. ఆయా పార్టీల నేతలతో చంద్రబాబు జరుపుతున్న మంతనాలు.. రాజకీయ కూటమికి దారితీస్తాయో లేదో చెప్పలేము కానీ కేంద్రంపై తిరుగుబాటు అని మాత్రం చెప్పగలనని స్పష్టం చేశారు.
పట్టించుకోని మోడీ..:
మంగళవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో చంద్రబాబు కనిపించడం మీడియాలో హైలైట్ అయింది. చాలామంది నేతల దృష్టిని ఆయన ఆకర్షించినప్పటికీ.. ప్రధాన మోడీ మాత్రం చంద్రబాబును పట్టించుకోలేదు.
సెంట్రల్ హాల్ కుడివైపు కూర్చున్న చంద్రబాబు ఆయా నేతలతో మాట్లాడుతుండగా.. ప్రధాని మోడీ కూడా అటు నుంచే రాజ్యసభకు వెళ్లారు. అయినప్పటికీ చంద్రబాబు వైపు ఆయన కన్నెత్తి కూడా చూడలేదు. మోడీ తనను ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని ఆ తర్వాత మీడియా సమావేశంలో చంద్రబాబు చెప్పారు.