ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8: ఢిల్లీలో బాబు బిజీ, కేంద్ర మంత్రులతో భేటీ
న్యూఢిల్లీ: జపాన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో ఆయన భేటీ శుక్రవారం ఉదయమే ప్రారంభమైంది. ఉదయమే కేంద్ర విద్యుచ్ఛక్తి మంత్రి పియూష్ గోయల్తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ విషయాలపై ఆయన కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది.
అయితే, తెలంగాణ ప్రభుత్వంతో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన కేంద్ర మంత్రికి చెప్పినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వంతో ఎదురవుతున్న ఇబ్బందులపై, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై, సెక్షన్ 8 అమలుపై ఆయన ప్రధానంగా కేంద్ర మంత్రులతో శుక్రవారం వరుసగా కేంద్ర మంత్రులను కలిసి విన్నవించనున్నారు.
శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆయన కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్తో సమావేశమం అవుతారు. ఆ తర్వాత జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో సమావేశం కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఎత్తిపోతల పథకానికి అభ్యంతరం తెలుపుతూ ఆయన ఇప్పటికే కేంద్ర జలసంఘానికి ఫిర్యాదు చేశారు. ఉమా భారతితో ఇతర నీటి పారుదుల ప్రాజెక్టులపైనే కాకుండా పాలమూరు ఎత్తిపోతల పథకంపై కూడా చర్చించే అవకాశం ఉందని అంటున్నారు.
కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, తదితర కేంద్ర మంత్రులతో కూడా చంద్రబాబు సమావేశమయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.