అమెరికా పర్యటనలో చంద్రబాబు బిజీబిజీ...నేడే ఐక్యరాజ్యసమితిలో కీలక ప్రసంగం
అమరావతి:ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన రెండో రోజూ బిజీ బిజీగా సాగింది. తొలిరోజు పెట్టుబడిదారులతో సమావేశాలతో పాటు ఎన్నారైల సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన ఆద్యంతం టైట్ షెడ్యూల్ తో ఎక్కడా విరామం లేకుండా సాగుతోంది.
సాయంత్రం 6 గంటలకు డీప్ ఓషియన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థ సిఈవో లిజ్ టేలర్తో సిఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సంస్థ సముద్ర గర్భంలో నిక్షిప్తమైన సంపదను కనుగొనే సాంకేతిక పరికరాల తయారీ సంస్థగా అంతర్జాతీయంగా గుర్తింపుపొందింది. డోయెర్ సంస్థ రూపొందించే సాధనాలపై చంద్రబాబు దృష్టి సారించారు. అలాగే రాత్రి ఒంటిగంట తరువాత ఐక్యరాజ్య సమితిలో జరిగే సమావేశంలో చంద్రబాబు ప్రసంగిస్తారని తెలిసింది.
రెండో రోజు సాయంత్రం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యుఎన్ ఉమెన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్తో చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం రాత్రి 7:30కి రిటైల్ బ్యాంకింగ్ సంస్థ బీఎన్పీ పరిబాస్ సీఈవో...జీన్ లారెంట్ బొన్నాఫేతో సీఎం భేటీ అవుతారు. అంతేకాకుండా ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్తో, రాక్ ఫెలర్ ఫౌండేషన్ అధ్యక్షుడు రాజీవ్ షాతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
ఈ సమావేశాల అనంతరం రాత్రి ఒంటిగంట తర్వాత ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రపంచ ఆర్థిక వేదిక, బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో జరిగే సుస్థిర అభివృద్ధి-ప్రభావ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకోపన్యాసం చేయనున్నారు. ఐక్యరాజ్యసమితి సదస్సులో కీలక ప్రసంగాలు చేసే తొమ్మిదిమంది ప్రముఖులలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరు కావడం విశేషం.
చంద్రబాబు ప్రసంగ అంశాలుగా సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత, అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలు కేటాయించినట్లు, ఆయా అంశాలపై చంద్రబాబు కీలక ప్రసంగం చేయనున్నట్లు ఎపి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.