వైసీపీ ఎమ్మెల్యేలను పందుల్లా కొంటున్నారు.., బాబుకు ఆ భయం పట్టుకుంది: జగన్
కర్నూలు: జిల్లాలో కొనసాగుతున్న జగన్ పాదయాత్ర 22వ రోజు ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం మీదుగా సాగింది. వెంగలాయదొడ్డి, కైరుప్పల, పుప్పాలదొడ్డి, బిలేకల్లు వరకు 15 కి.మీ. పాదయాత్ర చేసిన జగన్.. బిలేకల్లులో రాత్రి జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.
బహిరంగ సభలో జగన్ టీడీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. పార్టీ ఫిరాయింపులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదాను ప్రభుత్వం విమర్శించిన తీరును జనానికి వివరించారు. ప్రశ్నించే గొంతుకలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
బొబ్బలెక్కిన కాళ్లు.. ముల్లు దిగినా లెక్క చేయకుండా!: పాదయాత్రలో దూసుకెళ్తున్న జగన్..
పందుల్లా కొంటున్నారు:
కాంట్రాక్టర్ల నుంచి దండుకుంటున్న అవినీతి డబ్బుతో వైసీపీ ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు కొనుగోలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేలను గొర్రెలు, పశువుల్లా కాదు.. పందుల మాదిరి కొనుగోలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
అప్పుడు ఇద్దరమే ఉన్నాం:
ఎమ్మెల్యేలను లాక్కున్నంత మాత్రానా తమ పార్టీకి జరిగే నష్టమేమి లేదని జగన్ వ్యాఖ్యానించారు. 'ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే వైసీపీ ఉండదని చంద్రబాబు అనుకుంటున్నారు. 2011లో వైసీపీని ప్రారంభించినప్పుడు వైఎస్ కొడుకు జగన్, వైఎస్ సతీమణి విజయమ్మ మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలను గెలిపించుకున్న సత్తా మాకుంది' అని గుర్తుచేశారు.
హోదా తాకట్టు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది ప్రత్యేక హోదాతోనే ముడిపడి ఉందన్నారు జగన్. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా.. యువతకు ఉద్యోగావకాశాలు దక్కాలన్నా.. ప్రత్యేక హోదానే ఏకైక మార్గమన్నారు. అలాంటి హోదాను చంద్రబాబు ప్రధాని వద్ద తాకట్టు పెట్టేశారని విమర్శించారు.
బాబుకు ఆ భయం:
ఓటుకు నోటు కేసు గురించి ఈ సందర్భంగా జగన్ పరోక్షంగా ప్రస్తావించారు. హోదాపై ప్రశ్నిస్తే.. ఎక్కడా ఆడియో.. వీడియో కేసుల్లో బొక్కలో పెడుతారోనన్న భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు.
ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామి ఇంతవరకు నెరవేరలేదన్నారు. అధికార మదంతో ఆయన కళ్లు నెత్తికెక్కాయని విమర్శించారు. నిర్విరామంగా పాదయాత్ర చేస్తుండటంతో జగన్ కాళ్లకు బొబ్బలెక్కాయి. ఆయన భార్య వైఎస్ భారతి గురువారం మధ్యాహ్నాం విరామం సమయంలో ఆయనతో కాసేపు మాట్లాడారు.