రూ.90 వేల కోట్లు: డిస్కంలకు కేంద్రం ఇచ్చింది, చార్జీల పెంపుపై ఎల్లుండి టీడీపీ నిరసనలు
విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. నాలుగురేట్ల చార్జీలు పెంచడం సరికాదని, ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గత ఐదేళ్లలో తాము రూపాయి కరంట్ బిల్లు పెంచలేదని గుర్తుచేశారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలో.. చార్జీలు పెంచడం సరికాదన్నారు.
జగన్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లో టీడీపీ శ్రేణులు భౌతికదూరం పాటిస్తూ.. నిరసన తెలియజేయాలని కోరారు.
కరోనా వైరస్ నేపథ్యంలో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలపై చార్జీల మోత సరికాదని చంద్రబాబు అన్నారు. దేశంలోని అన్ని డిస్కంలకు కేంద్ర ప్రభుత్వం రూ90 వేల కోట్ల రాయితీ ఇచ్చిందని చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. కానీ వైసీపీ సర్కార్ మాత్రం విద్యుత్ ధరలు పెంచి.. పేదలను ఇబ్బందులకు గురిచేస్తోందని చెప్పారు. గత హయాంలో రూపాయి విద్యుత్ చార్జీ కూడా పెంచలేదని చంద్రబాబు తెలిపారు.
ఎన్నికల ముందు కరంట్ చార్జీలు పెంచమని చెప్పినా జగన్.. తర్వాత ఆ మాటే మరచిపోయారని విమర్శించారు. అధికారం చేపట్టేందుకు ఒక్క ఛాన్స్ అని.. చేపట్టాక మాత్రం చార్జీల మోత మోగించడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని.. సరైన సమయంలో బుద్దిచెబుతారని తెలిపారు.