అన్నా.. అర్థం చేసుకో: రంగంలోకి బాబు, బొజ్జలకు ఫోన్, సీఎం ఇంటికి బొండా
మంత్రివర్గం నుంచి తప్పించినందుకు బొజ్జల గోపాల కృష్ణ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేశారు. బొజ్జల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయనతో మాట్లాడారు.
అమరావతి: మంత్రివర్గం నుంచి తప్పించినందుకు బొజ్జల గోపాల కృష్ణ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేశారు. బొజ్జల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయనతో మాట్లాడారు.
బొజ్జల రాజీనామా విషయం తెలుసుకున్న చంద్రబాబు మూడుసార్లు ఫోన్ చేసి మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణకు గల కారణాలను ఆయనకు వివరించారు. అన్నా అపార్థం చేసుకోవద్దని బొజ్జలను చంద్రబాబు బుజ్జగించారు. దీనికి స్పందించిన బొజ్జల పరిస్థితిని అర్థం చేసుకున్నట్లు తెలిపారు.
విస్తరణ: హరికృష్ణ-కళ్యాణ్ రామ్ హాజరు, కాళ్లుమొక్కిన లోకేష్, తడబడిన అఖిల ప్రియ
కాగా, బొజ్జలను ఎవరో రెచ్చగొడుతున్నారని అధిష్ఠానం అభిప్రాయపడుతోంది. ఆదివారం ఉదయం బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్, ముఖ్యమంత్రికి పంపించిన విషయం తెలిసిందే.
చంద్రబాబు ఇంటికి బోండా ఉమ
మంత్రిపదవి ఆశించి భంగపడిన విజయవాడ మధ్య ఎమ్మెల్యే బొండా ఉమా మనస్థాపానికి గురయ్యారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని ప్రకటించారు. ఆయనకు మద్దతుగా కార్పొరేటర్లు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు.
దీంతో విజయవాడ ఎంపీ కేశినేని నాని తదితరులు ఆయన నివాసానికి చేరుకొని బుజ్జగించారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఉమాతో మాట్లాడారు. తన ఇంటికి రావాలని పిలిచారు. ఆయనను ఇంటికి తీసుకు రావాలని కేశినేని నాని, నారాయణలకు సూచించారు. దీంతో ఆయనను చంద్రబాబు నివాసానికి తీసుకు వస్తున్నారు.