‘సింగపూర్’ వెళ్లిపోవడం ఏపీకి శరాఘాతమే: జగన్ నిరంకుశపాలన వల్లేనంటూ చంద్రబాబు ఫైర్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన వల్లే సింగపూర్ కన్సార్టియం రాజధాని నిర్మాణ స్టార్టప్ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు ఒప్పందం..
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి రాజధాని ప్రాజెక్టు నిర్మాణంలో సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు రావడంతో సింగపూర్ సంస్థను పక్కనే పెట్టే ప్రయత్నాలు జరిగాయి. దీంతో ఆ సింగపూర్ కన్సార్టియం ఏపీ ప్రభుత్వంతో గతంలో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
ఏపీకి ఊహించని శరాఘాతం
కాగా, ఏపీ ప్రభుత్వ తీరుపై చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సింగాపూర్ కన్సార్టియంతో ఎంవోయూ రద్దు చేశారని, ఏపీ అభివృద్ధికి ఇది ఊహించని శరాఘాతమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అందుకే రద్దయింది..
కాగా, రాజధాని నగరంలో స్టార్టర్ అప్ ఏరియా ప్రాజెక్ట్ సాధ్యం కానందునే రద్దు చేసినట్లు ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ప్రతిపాదిత అభివృద్ధికి సరిపోని భారీ పెట్టుబడులతో కూడిన ఇంత భారీ ప్రాజెక్టును చేపట్టడం సాధ్యం కాదని సింగపూర్ కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం అంగీకరించాయని బుగ్గన వెల్లడించారు. అమరావతిలో స్టార్ట్ అప్ ఏరియా ప్రాజెక్ట్, అమరావతి డెవలప్మెంట్ పార్టనర్స్ లిమిటెడ్ అనే సంస్థ సుమారు 1700 ఎకరాల విస్తీర్ణాన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించబడిందని, దీనిలో కొన్ని సింగపూర్ కంపెనీలు ఉన్నాయని తెలిపారు. అస్సెండస్ సిన్బ్రిడ్జ్, సింకోర్ప్, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్లు కలిసి ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యేందుకు సిద్ధపడ్డాయని, అయితే ఆచరణ సాధ్యం కాని ఈ ప్రాజెక్టు రద్దయినట్లు తెలిపారు.
రద్దుపై బొత్స క్లారిటీ..
సింగపూర్.. స్టార్టప్ ప్రాజెక్ట్ విషయంపై గత కేబినెట్లోనే చర్చించి పరస్పర అంగీకారంతో రద్దు చేయాలని నిర్ణయించామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రెండు సార్లు సింగపూర్ ప్రతినిధులు నన్ను కలిసినా ఈ ప్రాజెక్ట్ వల్ల వచ్చే ఉపయోగమేంటో చెప్పలేకపోయారన్నారు. అందుకే పరస్పర అంగీకారంతో రద్దు చేయాలని నిర్ణయించామని.. మేం వేరే ప్రాజెక్టులో మళ్లీ కలిసి పని చేస్తామని సింగపూర్ మంత్రి స్వయంగా వెల్లడించారని తెలిపారు. సింగపూర్ ప్రభుత్వం రాసిన లేఖను పూర్తిగా చదవకుండానే చంద్రబాబు, లోకేష్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి బొత్స. ఇంకా ప్రభుత్వం తమదేనన్న భావనలో తండ్రీకొడకులు ఉండిపోయారంటూ ఎద్దేవా చేశారు.