మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట: ఓటుకు నోటుపై జగన్
కడప: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏమైనా చిత్తశుద్ధి ఉందంటే అది ఓటుకు నోటు కేసులోనే అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. ఒక ముఖ్యమంత్రి రెడ్ హ్యాండెడ్గా ఆడియో, వీడియో టేపుల్లో పట్టుబడి అరెస్టు కాకపోవడం బహుశా దేశచరిత్రనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఈయన ఒక్కరే కావచ్చునని ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.
అంతలా మేనేజ్ చేయగల సమర్థుడు చంద్రబాబు అని ఆయన అన్నారు. కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయలో శుక్రవారం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఏడో వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న జగన్ మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆడియో, వీడియో టేపుల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినా అరెస్టు కాకపోవడం ఆ కేసు పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి వల్లనే సాధ్యమైందని ఆయన అన్నారు. చంద్రబాబుపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.
ఎసిబి కోర్టు విచారణకు ఆదేశిస్తే..
ఎసిబి కోర్టు చంద్రబాబు విచారణకు ఆదేశిస్తే కేంద్ర మంత్రిగా ఉన్న టిడిపి నేత సుజనా చౌదరి అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్ తదితర కేంద్రమంత్రులను, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాను కలుస్తారని జగన్ అన్నారు.
గవర్నర్ను కలిసి...
సుజనా చౌదరి గవర్నర్ను కలిసి ప్రత్యేక హోదా కోసమని చెబుతారని జగన్ అన్నారు. ప్రత్యేక హోదాకు గవర్నర్కు ఏం సంబంధమని ఆయన ప్రశ్నింాచరు.
రెయిన్ గన్ల గురించి...
పదిహేనేళ్ల క్రితమే రెయిన్ గన్లు ఉన్నాయని, 11 ఏళ్లుగా ఇక్కడ ఉన్నాయని, వాటివల్ల కరువు నివారణ అసాధ్యమని, నీళ్లు ఉంటే అవి సద్వినియోగం చేసుకునేందుకు ఉపయోగపడుతాయని జగన్ అన్నారు.
అసలు నీళ్లే లేకుంటే..
అసలు నీళ్లే లేకుంటే రెయిన్ గన్లు ఏం చేయగలవని జగన్ ప్రశ్నించారు. నీళ్లు ఇవ్వకుండా ఏం ఇస్తే ఏం ప్రయోజనమని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు.