కృష్ణ జిల్లాలో కవ్వించుకుంటున్న తమ్ముళ్లు..! కం'ట్రోల్' చేయలేకపోతున్న చంద్రబాబు..!!
అమరావతి/హైదరాబాద్ : పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కలిసిండి బలేపేతం కోసం కృషి చేయాల్సిందిపోయి ఒకరుపై ఒకరు నిందించుకోవడం, రచ్చ చేసుకోవడం ఎంతవరకు సమంజసమనే చర్చ జరుగుతోంది. కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య ట్విటర్ వార్ కొనసాగుతోంది. ట్విటర్ వేదికగా ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు పరోక్షంగా విమర్శలు గుప్పించుకుంటూ విమర్శలతో రోడ్డున పడ్డారు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయి. కేశినేని నాని ఆదివారం ఉదయం బుద్దా వెంకన్నను ఉద్దేశించి కేశినేని ట్వీట్ చేశారు.
విజయవాడలో వింత రాజకీయాలు..! పొసగలేకపోతున్న తెలుగుతమ్ముళ్లు..!!
అసలే దారుణ ఓటమి. అందులోనూ బయటకు వలసలు. ఉన్నవాళ్లలో కొందరి అలక. తాజాగా... పరస్పర మాటల తూటాలు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ నేతల మధ్య గత నాలుగేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడిప్పుడే ఒకటొక్కటిగా బయటపడుతున్నాయి. పార్టీకి భవిష్యత్తు ఉంటుందో లేదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నేతలు మాత్రం తమ దారి తాము చూసుకుంటున్నారు. ఏ దారి లేని వాళ్లు మాత్రం పార్టీలోనే ఉంటూ పరస్పర విమర్శలు, ఆరోపణలు, మాటల తూటాలతో పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు.
శృతిమించుతున్న నాని, బుద్ద యవ్వారం..! గమనిస్తున్న బాబు..!!
వీరికి చెప్పలేక, నియంత్రతించలేక చంద్రబాబు కూడా చేతులెత్తేస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులతో కొద్ది రోజులుగా చంద్రబాబుకు తలనొప్పిగా మారిన విజయవాడ ఎంపీ కేశినేని నాని, తాజాగా మరో పోస్ట్ పెట్టారు. ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో పాటు, యువనేత లోకేష్ బాబును టార్గెట్ చేసుకుని ఈ పోస్ట్ ఉందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ పోస్టు టీడీపీ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. కేశినేని పోస్టుపై బుద్ధా వెంకన్న వెంటనే కౌంటర్ ఇచ్చారు.
వీళ్ల బాదేంటో అర్థం కాని బాబు..! పార్టీలో అంతా అయోమయమే..!!
'సంక్షోభం సమయంలో పార్టీ కోసం... నాయకుడి కోసం... పోరాడేవాడు కావాలి. ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం. నీలాగా అవకాశవాదులు కాదు.. చనిపోయే వరకూ చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడేవాడు కావాలి' అంటూ ట్వీట్ చేశారు. అంతకు ముందు నాని వెంకన్నను టార్గెట్ గా చేసుకుని పెట్టిన పోస్టులో... 'నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు - నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు' అని, ఎద్దేవా చేశారు. అందులోనే... 'నాలుగు పదాలు చదవలేని వాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేస్తున్నాడు... ఇది మన దౌర్భాగ్యం' అని కూడా విమర్శించారు.
తారా స్థాయిలో ట్వీట్ల యుద్దం..! పరువు తీస్తున్నారంటున్న పార్టీ శ్రేణులు..!!
వీరిద్దరూ ఇలా పరస్పరం సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసుకోవడాన్నిబట్టి చూస్తే విజయవాడ టీడీపీలో పరిస్థితి పూర్తిగా కంట్రోల్ తప్పిందన్న అర్థమవుతోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పట్టు కోసం అటు బుద్ధా, ఇటు నాని... ఇద్దరూ చేస్తోన్న ప్రయత్నంలో భాగంగానే జరుగుతోన్న ప్రచ్ఛన్నయుద్ధంలో ఇది ఓ భాగం మాత్రమేనని బెజవాడ టీడీపీ టాక్. ఇది ఫ్యూచర్లో మరింతగా ముదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఎంతవరకు దారితీస్తుంది...? అసలే కష్టకాలంలో ఉన్న పార్టీలో ఈ గొడవలేమిటి...? పార్టీ ప్రస్తుతమున్న స్థితిలో అందరూ ఐక్యంగా ఉండాల్సిన తరుణంలొ... ఈ కుమ్ములాటలేంటి చర్చ తెలుగు తమ్ముళ్లు, టీడీపీ అభిమానుల్లో చోటుచేసుకుంటోంది.