విదేశీ పర్యటన వాయిదా వేసుకున్న చంద్రబాబు.. రీజన్ ఇదేనా ?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభులతో కలిసి వెళ్ళాలనుకున్న విదేశీ పర్యటన ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్న విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు తన కుటుంబసభ్యులతో విదేశాలకు వెళ్లాలని చంద్రబాబునాయుడు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. కానీ ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఆయన తన పర్యటన వాయిదా వేసుకున్నారని తెలుస్తుంది. అందుకు ప్రధాన కారణాలు ఉన్నాయి.
ఉండవల్లి ప్రజావేదికలో రంజాన్ వేడుకలు: కేక్ కట్ చేసిన చంద్రబాబు!
అసెంబ్లీ మొదటి సమావేశంలోనే లేకుండా వెళ్తే పలాయనం చిత్తగించారనే అపవాదు వస్తుందేమో అన్న కారణం
అసెంబ్లీ మొదటి సమావేశంలోనే లేకుండా వెళ్తే విమర్శలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ మొదటి సమావేశం ఈనెల 12 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 12న కొత్త అసెంబ్లీ కొలువుదీరనుంది. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు అందరు కూడా అసెంబ్లీ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ప్రొటెం స్పీకర్గా బొబ్బిలి ఎమ్మెల్యే చిన అప్పల నాయుడు వ్యవహరిస్తారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుంది. వైసీపీ నుంచి 151 మంది, టీడీపీ నుంచి 23 మంది, జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే విజయం సాధించారు. వీరిలో ఎవరెవరు ఏయే శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తారనేది కూడా అదే రోజు తెలపనున్నట్లు సమాచారం.అంతే కాదు వైసీపీ ఇప్పటికే గత ప్రభుత్వ పాలన మీద నిప్పులు చెరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల వేదికగా టీడీపీ పాలనను టార్గెట్ చేస్తే చంద్రబాబు లేకుంటే సమాధానం చెప్పటానికి నాయకులున్నా దానికి అంత ఎఫెక్ట్ ఉండదు.
చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుంటే పలాయనం చిత్తగించారనే అపవాదు సైతం వస్తుంది అని భావిస్తున్న చంద్రబాబు సమావేశాలకు హాజరై పార్టీ నేతల్లో కాస్త ఆత్మ స్థైర్యం నింపాలని భావిస్తున్నారు. అలాగే వైసీపీ ఒకవేళ మాటల దాడికి దిగితే గట్టిగా సమాధానం చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే తన విదేశీ పర్యటన ప్రస్తుతానికి వాయిదా వేశారని భావిస్తున్నారు.
పార్టీలో అంతర్గత ఇబ్బందులు , పక్క చూపులు చూస్తున్న నేతలను కాపాడుకునే యత్నం లో టూర్ వాయిదా
అలాగే మరో కారణం సైతం లేకపోలేదు . టీడీపీ ఏపీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. ఒక పక్క బీజేపీ టీడీపీ నేతలను పార్టీ ఫిరాయింపు చేయించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్క అధికార పార్టీ వైసీపీవైపు చూస్తున్న నేతలు లేకపోలేదు. తాజాగా టీడీపీ నుండి గెలిచిన ఎంపీలు ముగ్గురిలో ఒకరైన విజయవాడ ఎంపీ కేశినేని నానీ చంద్రబాబు పై అలక వహించారు. తనకు పార్లమెంటరీ నేతగా అవకాశం ఇవ్వలేదని ఫీల్ అయిన ఆయన చంద్రబాబు ఆఫర్ చేసిన విప్ పదవిని తిరస్కరించారు. అయితే ఇందుకు మరో కారణం సైతం వుందని టాక్. విజయవాడలో పార్టీ కార్యాలయ ఏర్పాటు బాధ్యత మొదట కేశినేని నానీకి అప్పగించి కనీసం నానీకి కూడా చెప్పకుండా మళ్ళీ ఆ బాధ్యతను దేవినేనికి అప్పగించటం పై నానీ చంద్రబాబు పై గుర్రుగా ఉన్నారట.
ఇక నానీని బుజ్జగించటానికి ప్రయత్నించి ప్రస్తుతానికి ఇష్యూ సద్దు మణిగేలా చేశారు . కానీ పార్టీలో అంతర్గతంగా చాలా మంది పక్క చూపులు చూస్తున్నారు అన్న సమాచారంతో ఇప్పుడు విదేశీ పర్యటనకు వెళ్తే ఏమైనా జరగొచ్చు అని భావించి పార్టీ నాయకులను కాపాడుకునే క్రమంలో భాగంగా చంద్రబాబు పర్యటన వాయిదా వేసుకున్నారని సమాచారం .
అడకత్తెరలో పోక చెక్కలా చంద్రబాబు పరిస్థితి... ఏం చేస్తారో ?
ఏది ఏమైనా చంద్రబాబు అడకత్తెరలో పోక చెక్కలా నలుగుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళలేని, వెళ్ళకుండా ఉండలేని సందిగ్ధ స్థితి లో ఉన్నారు. ఇక పార్టీ క్యాడర్ ను కాపాడుకునే విషయంలో కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితి. ఒకపక్క ఓటమి మిగిల్చిన వేదన తట్టుకుంటూనే పార్టీ శ్రేణులను సమాయత్తం చెయ్యాల్సిన స్థితి. చంద్రబాబు ఇలాంటి కష్ట సమయలో ఎలా పార్టీని హ్యాండిల్ చేస్తాడన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించే అంశమే .