బాబుకు శిక్ష తప్పదు... జైలు జీవితమే.. అక్కడ తప్పించుకోవచ్చేమో కానీ.. : మంత్రి కొడాలి
అమరావతి భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు. అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేయడం ప్రీ-ప్లాన్డ్ వ్యవహారమే అని ఆరోపించారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు గురించి టీడీపీ నేతలకు ముందే చెప్పి... అక్కడ వారితో భూములు కొనుగోలు చేయించారని ఆరోపించారు. అమాయక రైతులను రాజధాని పేరుతో మోసం చేసి కేవలం రూ.25లక్షలకే ఎకరా చొప్పున కొనుగోలు చేశారని ఆరోపించారు.
అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్..
అమరావతిలో టీడీపీ నేతలు రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని... కోట్లు గడించారని కొడాలి నాని మండిపడ్డారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అమరావతిలో భూకుంభకోణం జరిగిందని చెప్తూనే ఉన్నామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే భూకుంభకోణంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ, సిట్లను నియమించారని గుర్తుచేశారు. అమరావతి భూ కుంభకోణంపై నిజాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్రాన్ని కోరామన్నారు.
కోట్లు చెల్లించి 'స్టే'లు...
కరోనా పరిస్థితులు లేదా దేశవ్యాప్తంగా అనేక కేసులతో సీబీఐ తలముకనలైన కారణంగా అమరావతి భూకుంభకోణంపై దర్యాప్తుకు కేంద్రం నిర్ణయంలో జాప్యం జరుగుతోందన్నారు. దీంతో ముఖ్యమంత్రి జగన్ ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించారని చెప్పారు. సీఎం ఆదేశాలతో అమరావతి రాజధాని భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిందన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి చంద్రబాబు,అతని బినామీలు న్యాయవాదులకు కోట్ల రూపాయల ఫీజులు చెల్లించి 'స్టే'లు తెచ్చుకున్నారని అన్నారు.
బాబుకు శిక్ష తప్పదు...
అవినీతితో డబ్బు సంపాదించడంలో చంద్రబాబు మాస్టర్ అని కొడాలి విమర్శించారు. ఎన్ని కేసుల్లో ఆయన ఎన్ని స్టేలు తెచ్చుకున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. 40ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రతీ వ్యవస్థలో సొంత మనుషులను పెట్టుకుని... వాళ్ల ద్వారా కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.అమరావతి భూకుంభకోణంలో చంద్రబాబు ప్రమేయం ఉందని తేలితే ఆయన మీద కూడా కేసులు పెడుతారని,ప్రజల ముందే శిక్ష వేస్తారని అన్నారు. ప్రస్తుతం ఇంట్లో ఉంటూనే చంద్రబాబు జైలు జీవితం గడుపుతున్నారని విమర్శించారు. కోర్టుల నుంచి తప్పించుకోవచ్చునేమో గానీ... చంద్రబాబుకు ప్రజల నుంచి శిక్ష తప్పదన్నారు.
Recommended Video
ఇటు అమరావతి కేసు... అటు ఫైబర్ గ్రిడ్ అవినీతి...?
అమరావతి రాజధాని భూకుంభకోణంపై ఏసీబీ మంగళవారం(సెప్టెంబర్ 15) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్పై పూర్తి స్థాయి దర్యాప్తుకు సిద్దమవుతున్న ఏసీబీ... ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఫైబర్ గ్రిడ్,చంద్రన్న కానుకల పేరుతో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ రెండింటిపై సీబీఐ దర్యాప్తుకు కేంద్రం నుంచి తక్షణ స్పందన వచ్చేలా ఒత్తిడి తేవాలని పార్టీ ఎంపీలను జగన్ ఆదేశించారు. కాబట్టి మున్ముందు ఈ రెండు కేసులు కూడా చంద్రబాబును వెంటాడుతాయనడంలో సందేహం లేదు.