బోయపాటితో చంద్రబాబు సినిమా, అందుకే పుష్కర ప్రమాదం: రఘువీరా
అనంతపురం: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట జరిగి ప్రాణ నష్టం సంభవించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కారణమని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చంద్రబాబు సినిమా షూటింగ్ జరిపారని, దాంతో ఆలస్యం జరిగి తొక్కిసలాట జరిగిందని ఆయన అన్నారు.
స్నానం చేసేందుకు చంద్రబాబు మూడు గంటల సమయం తీసుకున్నారని, చంద్రబాబు నిర్లక్ష్యం వల్లనే 27 మంది మరణించారని ఆయన అన్నారు. చంద్రబాబుపై వెంటనే 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పుష్కరాల్లో తొలిరోజు దుర్ఘటనతో ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం వచ్చిందని ప్రతిపక్షాలు సంబరపడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. కర్నూలు, ఉత్తరాఖండ్ వరదల సమయంలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ విమర్శలు చేయలేదని ప్రభుత్వంతో పోటీ పడి సేవా కార్యక్రమాలు చేసిందని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికైనా విమర్శలు మాని ఆచరణాత్మక సూచనలు ఇవ్వాలని ఆయన గురువారం హైదరాబాదులో కోరారు.
కాగా, చంద్రబాబు విఐపి ఘాట్లో కాకుండా సామాన్య భక్తుల ఘాట్లో పుష్కర స్నానం చేయడం వల్లనే ప్రమాదం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.