ఎన్టీఆర్ ఫోటో: మంత్రి రావెలకు బాబు గట్టి క్లాస్, 'రాజధాని' పైనా..
అమరావతి: మంత్రి రావెల కిషోర్ బాబు పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాటి కేబినెట్ సమావేశం సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇటీవల సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహించిన కార్యక్రమాల్లో ఎక్కడా టిడిపి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిత్రపటాలు లేకపోవడంపై రావెలకు చంద్రబాబు అక్షింతలు వేశారని తెలుస్తోంది.
మంత్రివర్గ సమావేశం మొదలవడానికి ముందు, మంగళవారం నుంచి టిడిపి నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రలు, సభ్యత్వ నమోదుపై మంత్రులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. గ్రామస్థాయి పార్టీ కమిటీ సభ్యులతో సహా పది వేలమందితో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆ సందర్భంగా ఆయన మంత్రులతో మాట్లాడారు. ఎన్టీఆర్ చిత్రపటాలు లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం సరికాదన్నారు. సాధారణంగా మంత్రివర్గ సమావేశానికి ముందు గానీ, తర్వాత గానీ పార్టీ సమన్వయసంఘ సమావేశం నిర్వహిస్తారు. ఈసారి పార్టీ నాయకులంతా జనచైతన్య యాత్రల ఏర్పాట్లలో ఉండటంతో ఈ సమావేశం నిర్వహించలేదు. మంత్రులనే ముందుగా రమ్మని, పార్టీ వ్యవహారాలపై చర్చించారు.
మరోవైపు, రాజధాని పనులు అనుకున్నంత వేగంగా జరగకపోవడంపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు స్థలాలు ఇవ్వడంలో జాప్యం జరగడంపై అసహనం వ్యక్తం చేశారు.
రోడ్లు వంటి మౌలిక వసతుల పనులు ముందుకు సాగడం లేదని, విద్యాసంస్థలు, ఆసుపత్రులు వంటివి ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ఇంతవరకు స్థలాలు చూపించలేదని, రాజధానిపై తాను ప్రతి వారం సమావేశం ఏర్పాటుచేసి వెంటపడుతున్నా ఉపయోగం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.