అమరావతి కోసం: మచిలీపట్నం పాదయాత్రలో జోలె పట్టి విరాళాలు సేకరించిన చంద్రబాబు
ఏపీ రాజధాని అమరావతినే అంటూ ఏపీలో ఆందోళనలు ఉధృతం అయ్యాయి. వైజాగ్ వద్దు అమరావతి ముద్దు అంటున్న రాజధాని గ్రామాల రైతులకు బాసటగా పోరాటం సాగిస్తుంది టీడీపీ. ఇక రాజధాని అమరావతి పోరాట ప్రకంపనలు రాష్ట్రం అంతా తెలిసేలా ఆందోళనలు ఉధృతం చేసింది టీడీపీ . రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రైతులకు మద్దతుగా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు టీడీపీ నేతలు.
రాజధాని అమరావతి అని చెప్పేవరకు పోరాటం చేస్తామన్న చంద్రబాబు
రాజధాని అమరావతినే , అమరావతి విషయంలో ప్రభుత్వ వైఖరి మారే వరకు, అమరావతినే రాజధానిగా కొనసాగిస్తాం అని చెప్పేవరకు పోరాటం సాగిస్తామని తేల్చి చెప్పారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు . రాజధాని కోసం నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా అఖిలపక్షం గురువారం నాడు మచిలీపట్నంలో పాదయాత్ర నిర్వహించింది. రాజధానిని తరలించొద్దని డిమాండ్ చేస్తున్న అమరావతి ప్రాంత ప్రజలకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు మచిలీపట్నంలో పాదయాత్రలో పాల్గొన్నారు .
మచిలీపట్నంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో పాదయాత్ర .. పాల్గొన్న చంద్రబాబు
టీడీపీ శ్రేణులతోపాటు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. అక్కడ టీడీపీ శ్రేణులు, ప్రజలతో కలిసి అమరావతి రైతుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని పాదయాత్ర నిర్వహించిన చంద్రబాబు అమరావతి పోరాటానికి విరాళాల కోసం జోలె పట్టారు.పాదయాత్ర మెయిన్ సెంటర్కు చేరుకున్న వెంటనే చంద్రబాబు జోలె పట్టారు. విరాళాలు సేకరణ ప్రారంభించారు. చంద్రబాబు విరాళాల సేకరణకు పలువురు తమ వద్ద వున్న నగదును విరాళంగా ఇచ్చారు.
అమరావతి రైతుల కోసం జోలె పట్టిన టీడీపీ అధినేత
కొందరు మహిళలు కూడా విరాళమిచ్చేందుకు ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు వారి వద్దకు తానే స్వయంగా వెళ్ళి రాజధాని అమరావతి లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో వివరించారు. జోలె పట్టి రోడ్లపై నడుస్తూ ప్రజల వద్ద నుండి విరాళాలు సేకరించిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు. రాజధాని ప్రాంత రైతులకు సంఘీభావంగా మచిలీపట్నంలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన జోలె పట్టి ప్రజల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నించారు.రాజధానిగా అమరావతి ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని లేదంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని చంద్రబాబు అన్నారు.
రాజధాని రైతుల కోసం చెవిపోగులు విరాళంగా చిన్నారి ఆశ్రిత ఇచ్చిందన్న లోకేష్
ఇక రాజధాని అమరావతిలో రైతులు సాగిస్తున్న నిరసన దీక్షల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు. తుళ్లూరు, మందడం గ్రామాల్లో రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు ఎంతోమంది తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారని, రైతుల పోరాటానికి మద్దతుగా అశ్రిత అనే అమ్మాయి తన చెవిపోగులు ఇచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు.