పాచిపోయిన లడ్డులైతే నేనెందుకు తీసుకుంటా: పవన్కు చంద్రబాబు కౌంటర్
హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా అడిగితే పాచిపోయిన లడ్డూలు ఇచ్చారనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. 'పాచిపోయిన లడ్డు అని పవన్ అన్నారు. పాచిపోయినవైతే నేనెందుకు తీసుకుంటాను' అని చంద్రబాబు అన్నారు. కేంద్రం హోదాకి సరిపడా సాయం అందిస్తానంటేనే ప్యాకేజీకి అంగీకరించినట్లు తెలిపారు. అయితే పవన్ భావోద్వేగంతో అలా అన్నాడని, పవన్ను తాను తప్పుపట్టడం లేదని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై శాసనమండలిలో ప్రసంగించారు సీఎం చంద్రబాబు నాయుడు. కరువు పరిస్థితులపై ఏపీ శాసనమండలిలో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా.. రుణమాఫీ చేయడంతో, ద్వాక్రా రుణాలు ఇచ్చామని పేర్కొన్నారు. 'హోదా కోసం కేంద్రంతో గొడవపడాలని కొందరంటున్నారు.. అలా చేస్తే ఏమవుతుంది? పోలవరం పూర్తి చేయడం ఆలస్యం అవుతుంది. అప్పుడు మళ్లీ మీరే నన్ను ప్రశ్నిస్తారు..' అంటూ తనపై వస్తోన్న విమర్శలకు సమాధానం చెప్పారు చంద్రబాబు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొన్ని సమస్యలు వారసత్వంగా వస్తున్నాయన్నారు. హైదరాబాద్ గురించి మాట్లాడితే ఎగతాళి చేసే పరిస్థితి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో కరెంట్ కోత లేకుండా చేసిన ఘనత టీడీపీదే అని స్పష్టం చేశారు.
ఇక కరువు పరిస్థితుల గురించి ప్రస్తావిస్తూ.. శ్రీకాకుళం విజయనగరంలో నీళ్లున్నా.. ఆ నీటిని వాడుకునే ప్రయత్నాలు జరగలేదన్నారు. రాబోయే రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లోను నీటి సమస్య లేకుండా చేస్తామన్నారు చంద్రబాబు. ఎట్టి పరిస్థితుల్లోను పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటుమన్నారు. ప్రకాశం ప్రజల బాధను అర్థం చేసుకుని వెలిగొండ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని చెప్పారు.
రాయలసీమ నాలుగు జిల్లాల్లోను తీవ్ర కరువు ఉందని అనంతపరం పరిస్థితి మరీ దారుణగా ఉందన్నారు. దేశంలోనే ఎక్కువ భూములున్న అనంతపురంలో, తక్కువ వర్షపాతం నమోదవుతున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అనంతపురం జిల్లాలో గడిచిన 18ఏళ్లుగా నాలుగేళ్లు మాత్రమే రైతులు పంట వేసుకోగలిగారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు.
ఈ పరిస్థితిని అరికట్టేందుకే టీడీపీ ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ తీసుకొచ్చిందన్నారు. క్యాంపులు పెట్టి మరీ రైతులకు సబ్సిడీలపై అవగాహన కల్పించామన్నారు. కరువు జిల్లా అయిన అనంతపురంలో పౌష్టికాహార లోపం కూడా ఉందని, అక్కడి రైతులకు ఆదాయం తక్కువ నష్టం ఎక్కువగా ఉందన్నారు. అయితే అనంతపురంలో పండించే పళ్లకు.. ప్రపంచంలోనే ఎక్కడా లేని రుచి ఉంటుందని చెప్పుకొచ్చారు చంద్రబాబు.
కరువు నివారణ చర్యలపై స్పందించిన చంద్రబాబు.. కరువును ఎదుర్కోవడానికి రెయిన్ గన్స్ ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. అనంతలో ఉండి కరువు పరిస్థితులపై అధ్యయనం చేశానని చెప్పారు. చింతలపూడి దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ను ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని ఈ సందర్బంగా చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలతో ఏపీలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయన్నారు.
ఇక ప్రతిపక్ష విమర్శల గురించి ప్రస్తావిస్తూ.. 'చర్చ కోసం వాదనలు వద్దు ప్రయోజనకరంగా చర్చించండి. వాస్తవాలు దృష్టిలో పెట్టుకుని సలహాలు ఇస్తే' స్వీకరించడానికి తాను సిద్దం అని తెలిపారు. 'మూర్ఖంగా వెళితే రాష్ట్రానికి ఏమి మిగలదు, హోదా వచ్చేవరకు పోలవరం పూర్తి చేయవద్దా..? అంటూ ప్రశ్నించారు. హోదా ప్రయోజనాలను ప్యాకేజీతో ఇస్తామంటున్నారు.. వద్దనాలా..? అంటూ నిలదీశారు. ఎవరికీ హోదా ఇచ్చే పరిస్థితులు లేవని కేంద్రం చెబుతోందని.. తనకు మంచి పేరు రావడం భరించకపోతే తానేమి చేయలేనని అన్నారు.
ఇక తనది రాజకీయమని విమర్శిస్తున్న వాళ్లు తనది రాజనీతి అని తెలుసుకోవాలన్నారు. 'నేను రాజీ పడడమంటే అది ప్రజల కోసమే. 20 ఏళ్లుగా ప్రజలే నా హైకమాండ్. రాష్ట్రంలో దివీస్ పరిశ్రమకు చోటు కల్పించి 2500 ఉద్యోగాలు కల్పిస్తామంటే అడ్డు తగులుతున్నారు. పరిశ్రమలు రావాలని డిమాండ్ చేయడం.. ఆపై అడ్డుకోవడం దేనికి' నిదర్శనమని అసంతృప్తి వ్యక్తం చేశారు.