మనసు గాయపడేలా? ఇలాగేనా?: పవన్ కళ్యాణ్కు మద్దతుగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
అమరావతి: ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. విశాఖలో పవన్ కళ్యాన్ చేపట్టిన లాంగ్ మార్చ్కు మద్దతు ఇవ్వాలంటూ కోరగానే.. చంద్రబాబు నాయుడు తన పార్టీకి చెందిన కీలక నేతలను ఆ ర్యాలీకి పంపడం గమనార్హం.
పవన్ కళ్యాణ్కు ఆ కర్మ పట్టలేదు! నేను మీలా గడ్డి తినలేను: సీఎం జగన్, మంత్రులపై జనసేనాని నిప్పులు
పవన్ కళ్యాణ్కు మద్దతుగా..
ఇది ఇలావుంటే, తాజాగా, పవన్ కళ్యాన్కు మద్దతుగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. ఏపీ సర్కారు విధానాలపై పవన్ కళ్యాన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇసుక పాలసీ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారును ఏకిపారేస్తున్నారు. దీంతో అదే స్థాయిలో పవన్ కళ్యాణ్పై కూడా మంత్రులు, వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
పవన్ వ్యక్తిగతంపై విమర్శలా?
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పలు విమర్శలు చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలపై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ మనసు గాయపడేలా..
చిత్తూరు జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతల విమర్శలు శృతిమించుతున్నాయన్నారు. అనుచిత వ్యాఖ్యల చేయడం సరికాదని హితవు పలికారు. వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ మనసు గాయపడేలా మాట్లాడటం మంచిది కాదన్నారు. రాష్ట్రంలో పులివెందుల పంచాయతీలు చేయాలనుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు మండిపడ్డారు. ఏరికోరి తెచ్చుకున్న ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యంను జగన్ గంగలో ముంచేశారని విమర్శించారు.
అలాంటి వ్యక్తి మమ్మల్ని విమర్శిస్తారా?
ప్రతి శుక్రవారం బోనులో నిల్చునే వ్యక్తం తమపై, టీడీపీపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి ఇంకా డబ్బు పిచ్చి పోలేదన్నారు. రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూతో ఎంతో మంది చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఓ వైపు ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా.. ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ నేతలే ఇసుకను దోచుకుంటున్నారని ఆరోపించారు.
జగన్ చెప్పేదొకటి.. చేసేదొకటి..
ఇసుకను ఉచితంగా ఇవ్వాలని, అప్పుడు కార్మికుల ఆత్మహత్యలు ఆగుతాయన్నారు. మృతి చెందిన భవన నిర్మాణ కార్మికులకు రూ. 25లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన ఉండదని.. అదే ఆయన నీతి, నిజాయితీ అంటూ చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల వ్యవసాయం దెబ్బతిందని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. రైతు భరోసా మొత్తాన్ని ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్ సీఎం అయ్యాక అన్ని ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయని అన్నారు.