టిక్కెట్లపై కేఈ ఫ్యామిలీకి బాబు హామీ, బుట్టాకు సస్పెన్స్: పోటీ ఖాయం... అఖిలకు ఏవీ సుబ్బారెడ్డి షాక్
కర్నూలు/అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరుసగా ఒక్కో లోకసభ నియోజకవర్గం, దాని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, ఆశావహులు, ప్రజాప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నేతలతో భేటీ అయ్యారు.
ఈ భేటీ సందర్భంగా చంద్రబాబు పలువురికి టిక్కెట్లు ఖరారు చేశారు. అయితే పలు నియోజకవర్గాలు ఇంకా సస్పెన్స్లోనే ఉండిపోయాయి. ఆయా నియోజకవర్గాల్లో టీజీ భరత్, ఎస్వీ మోహన్ రెడ్డి, భూమా కుటుంబం, ఏవీ సుబ్బారెడ్డి.. ఇలా పలువురి మధ్య పోటీ నెలకొని ఉంది.
కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి హామీ
కర్నూలు లోకసభ నియోజకవర్గ పరిధిలోని నేతలతో జరిగిన భేటీలో... టికెట్ల విషయమై ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. పత్తికొండ, డోన్ నియోజకవర్గాలు కేఈ కుటుంబానికే ఇస్తామని అధినేత హామీ ఇచ్చారు. చంద్రబాబు జిల్లాలోని పలు నియోజకవర్గాల నేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. ఇందులో భాగంగా కొందరిని ఖరారు చేశారు.
కర్నూలు, ఆదోనిలపై సస్పెన్స్
డోన్ నియోజకవర్గాన్ని కేఈ ప్రతాప్, పత్తికొండ నియోజకవర్గంకు కేఈ శ్యాంబాబు పేర్లను ఎంపిక చేశారు. జిల్లాలోని మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తిక్కారెడ్డి, ఎమ్మిగనూరు నుంచి బీవీ జయనాగేశ్వర రెడ్డి, బనగానపల్లె నుంచి బీసీ జనార్ధన్రెడ్డిని అభ్యర్థులుగా ఖరారు చేశారు. కర్నూలు, ఆదోని అసెంబ్లీ నియోజకవర్గాల కేటాయింపుపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది.
ఎస్వీ మోహన్ రెడ్డి వర్సెస్ టీజీ భరత్, బుట్టా రేణుకకు టిక్కెట్ దక్కేనా
కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ కర్నూలు అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. కర్నూలు లోకసభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇటీవల చెప్పారు. ఈ నెల 28న ఆయన చంద్రబాబు కలిసి, టీడీపీలో చేరనున్నారు. ఆదోని స్థానం కోసం బుట్టా రేణుక, మీనాక్షి నాయుడు పోటీలో ఉన్నారు. ఈ స్థానాన్ని కూడా సస్పెన్స్ కొనసాగుతోంది.
అఖిలప్రియకు ఏవీ సుబ్బారెడ్డి షాక్
ఇదిలా ఉండగా, మరోవైపు నంద్యాల లోకసభ పరిధిలోని ఆళ్లగడ్డ, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాలలో భూమా అఖిలప్రియకు షాక్ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు. తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల లేదా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకచోటు నుంచి పోటీ చేస్తానని ఏవీ శుక్రవారం తెలిపారు. ఈ రెండు నియోజకవర్గాలలో తనకు బలమైన కేడర్ ఉందన్నారు. పలు సర్వేలు కూడా తనకు అనుకూలంగా వచ్చాయన్నారు. గతంలో తాను భూమా నాగిరెడ్డి కోసం సీటును త్యాగం చేశానని చెప్పారు. ఇప్పుడు ఓ చోటు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని, అయితే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు.