అచ్చెన్నాయుడు, రవీంద్రకు చంద్రబాబు పరామర్శ: తప్పులు నిలదీస్తేనే తప్పుడు కేసులు..
మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. వారిద్దరూ ఇటీవలే జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయగా.. వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. రెండు కేసుల్లో ఇద్దరు నేతలు బెయిల్ మీద బయటకు వచ్చారు.
మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు ఆయన ఇంటికి టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చారు. అతని ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా పాజిటివ్ రావడంతో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో అచ్చెన్నాయుడు చేరిన సంగతి తెలిసిందే. కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఆయన ఇంటికి చంద్రబాబు నాయుడు వచ్చారు. ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడికి హైకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
మాజీమంత్రి కొల్లు రవీంద్రని కూడా చంద్రబాబు పరామర్శించారు. వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. చింత చిన్నాకు రవీంద్ర అండగా ఉన్నారని పోలీసులు అభియోగాలు మోపారు. ఆయనే పోలీసులకు లొంగిపోగా.. జైలుకు తరలించారు. పలుమార్లు బెయిల్ కోసం ఆప్లై చేయగా.. చివరికీ మంజూరు చేశారు.
Recommended Video
జగన్ సర్కార్ తప్పులు నిలదీయడమే తాను చేసిన తప్పా అని మాజీమంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అలాగైతే ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా నిలదీస్తూనే ఉంటానని తెలిపారు. సత్యం తన ఆయుధం అని.. ప్రజల క్షేమమే తన లక్ష్యమని స్పష్టంచేశారు. తనను అక్రమ కేసులో ఇరికించారని ఆరోపించారు. ఇదే సత్యమనే విషయాన్ని అందరూ గుర్తించారని పేర్కొన్నారు.