జగన్ 'అవిశ్వాసం'కు బాబు షాక్: భూమనకు ఇబ్బంది లేకుండా కొత్త ప్లాన్
హైదరాబాద్: ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం పైన అధికార తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోతోంది. తద్వారా వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కదుపుతున్న పావులకు ప్రతిగా పావులు కదుపుతోంది.
అవిశ్వాసం ద్వారా జగన్ ఏమైతే సాధించాలనుకుంటున్నారో అది జరగకుండా చేసే దిశలో టిడిపి ముందుకు వెళ్తోంది. తాము ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం తేలిపోతుందని, చంద్రబాబు ప్రభుత్వం పడిపోదని వైయస్ జగన్కు స్పష్టంగా తెలుసు.
అయినప్పటికీ అవిశ్వాస తీర్మానానికి ఆయన మొగ్గు చూపారు. దీని వెనుక పెద్ద కారణం ఉంది. అవిశ్వాస తీర్మానం పెట్టి, తద్వారా తన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి, అవిశ్వాసానికి అనుకూలంగా (చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా) ఓటు వేయాలని ఆదేశించాలని భావించారు.
వైసిపి విప్ జారీ చేస్తే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఆ విప్ను అనుసరించాల్సిందే. ఇటీవల టిడిపిలో చేరిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా విప్ను పాటించాల్సిందే. ఆ విప్ పాటించకుండా చంద్రబాబు ప్రభుత్వానికి అండగా నిలిస్తే వారు చిక్కుల్లో పడినట్లే.
ఈ ఉద్దేశ్యంతోనే.. ఇటీవల టిడిపిలో చేరిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకొని జగన్ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. విప్ జారీ చేసినప్పటికీ... టిడిపిలో చేరిన వారు ప్రభుత్వానికి మద్దతు పలికితే.. వారిపై చర్యలు తీసుకోవాలని జగన్ పోరాటం చేయాలని భావిస్తున్నారు.
అయితే, జగన్ ప్లాన్కు టిడిపి కౌంటర్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. అవిశ్వాస తీర్మానం పైన విప్ జారీ చేసే అవకాశం లేకుండా చర్చ చేపట్టాలని టిడిపి భావిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం నాడు బీఏసీ సమావేశం పూర్తి కాగానే అవిశ్వాసంపై చర్చ చేపట్టాలని టిడిపి భావిస్తోంది. అయితే వైసిపి మాత్రం 20వ తేదీన చర్చకు పట్టుబడుతోంది.
ఈ రోజే చర్చ చేపడితే అవిశ్వాసం పైన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసేందుకు వైసిపికి సమయం ఉండదు. తర్వాత రోజుల్లో చర్చ జరిగితే విప్ జారీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ వెసులుబాటు లేకుండా ఈ రోజే చర్చకు టిడిపి ప్లాన్ చేసిందని తెలుస్తోంది.
అవిశ్వాసంపై ఇవాళే చర్చ: కాల్వ
వైసిపి ఇచ్చిన అవిశ్వాసం పైన ఈ రోజే (సోమవారం) చర్చ జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు చెప్పారు. అవిశ్వాసంపై చర్చకు కొంత సమయం కావాలని వైసిపి కోరిందన్నారు. అయితే అవిశ్వాసం నోటీసు ఇచ్చాక విధాన ప్రకటన చేయకూడదనే తక్షణ చర్చ అన్నారు. ఐదారు గంటల పాటు చర్చ ఉంటుందన్నారు. బడ్జెట్ పైన చర్చకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే ఈ రోజు అన్నారు.
వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. అవిశ్వాసంపై చర్చకు తమకు ఓ రోజు సమయం కావాలని కోరామన్నారు. తమకు విప్ జారీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. వైసిపి ఎమ్మెల్యేలకు ఎస్సెమ్మెస్, ఈ మెయిల్ ద్వారా విప్ జారీ చేస్తున్నట్లు చెప్పారు. ఇది తెలుగుదేశం పార్టీకి కౌంటర్ అని చెప్పవచ్చు.
అయితే, పార్టీలోకి వచ్చిన వైసిపి ఎమ్మెల్యేల విషయంలో ఇబ్బంది లేకుండా ఉండేందుకు, వైసిపికి విప్ జారీ చేసే అవకాశం లేకుండా చేసేందుకే ఈ రోజే చర్చకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. కాగా, సభలో బలాబలాలు.. టిడిపి 112 (వైసిపి నుంచి చేరిన 8 మంది ఎమ్మెల్యేలు, స్వతంత్రులు కలిపి), బిజెపి 4, వైయస్సార్ కాంగ్రెస్ 59 మంది ఉన్నారు.