ఇది ప్రజాధనం: ఒక్క ప్రెస్ మీట్ కోసం ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్ లోనా..?
ఏపీ సీఎం చంద్రబాబుపై విపక్షాలు మండిపడుతున్నాయి. శుక్రవారం లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగిసింది. విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఇక అర్థరాత్రి చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి ప్రధాని మోడీ, ఎన్డీఏ సర్కార్పై నిప్పులు చెరిగారు. ఇక శనివారం ఉదయం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. కేవలం ఒక ప్రెస్ మీట్ పెట్టడం కోసం చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏముందని విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ప్రజల సొమ్మును చంద్రబాబు తన సొంతలాభం కోసం దుర్వినియోగం చేస్తున్నారని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.
ఇక ఢిల్లీ వెళ్లి చంద్రబాబు సాధించిందేమిటి..? అర్థరాత్రి అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు ఏమైతే లెక్కలు వల్లెవేశారో అవే లెక్కలు ఢిల్లీలో కూడా చెప్పాడని అయితే అమరావతిలో తెలుగులో మాట్లాడిన సీఎం ఢిల్లీలో ఇంగ్లీషులో మాట్లాడారని విపక్షాలు ధ్వజమెత్తాయి. ఓ వైపు లోటుబడ్జెట్ ఉన్న రాష్ట్రంగా చంద్రబాబు చెప్పుకుంటూ మరోవైపు అతని స్వలాభం కోసం ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్నారని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అవిశ్వాస తీర్మానంపై ఇతరపార్టీలు మద్దతు తెలిపినందున ఆ పార్టీ నేతలకు ధన్యవాదాలు చెప్పేందుకే ఢిల్లీ వెళ్లారంటూ వార్తలు వస్తున్నప్పటికీ... టీడీపీ ఒక్కటే అవిశ్వాస తీర్మానం పెట్టలేదని.. కాంగ్రెస్తో సహా కమ్యూనిస్టులు, మజ్లిస్, ఇతర పార్టీలు కూడా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయని విపక్షనేతలు గుర్తు చేశారు. అంతేకాదు ఆ పార్టీ నేతలు ఎవరూ ఏపీకి అన్యాయం జరిగిన తీరుపై మాట్లాడలేదని... వారి రాష్ట్ర సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు మాత్రమే ప్రస్తావించినట్లు అపొజిషన్ నేతలు గుర్తు చేశారు. ఇక చంద్రబాబు ఏదైనా కొత్త అంశాలు చెప్పారా అంటే అదీ లేదని మండిపడ్డ నేతలు... ఇంకా నాలుగేళ్ల నాటి పాత చిత్రాన్నే చంద్రబాబు చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. నాడు లోక్ సభలో తలుపులు వేసి మరీ రాష్ట్రాన్ని విభజించారన్న పాతకథనే చంద్రబాబు ఇంకా చెప్పడం చూస్తే విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.
ఇక నిన్న పార్లమెంటులో తమ ఎంపీలు వ్యవహరించిన తీరు బాగుంది కనుక వారిని అభినందించేందుకు ఢిల్లీ వెళ్లారా... అంటే ఎలాగూ శనివారం, ఆదివారం సభలు జరగవు కనుక వారు విజయవాడ వచ్చే అవకాశం ఉంది.మరి చంద్రబాబు అక్కడ వారిని అభినందించి ఉండొచ్చు కదా అనే వాదన కూడా ప్రతిపక్షాలు తీసుకొస్తున్నాయి. కేవలం మోడీని జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేశారని జాతీయ రాజకీయ విశ్లేషకులతో పాటు రాష్ట్ర సీనియర్ బీజేపీ నాయకులు చెబుతున్నారు. మొత్తానికి మోడీని విమర్శించేందుకు ప్రత్యేక విమానంలో చంద్రబాబు వెళ్లడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. అది కచ్చితంగా ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.