ఓపికపడుతున్నా, మీరే అన్నారుగా.. ఇప్పుడేం చేశావ్: మోడీకి బాబు డెడ్లైన్, విష్ణు కౌంటర్
అమరావతి: రాజధాని అమరావతి తెలుగు వారి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆయన అసెంబ్లీలో బుధవారం మాట్లాడారు. దేశంలోని నెంబర్ వన్ రాజధాని ఏది అంటే అమరావతి చెప్పేలా నిర్మిస్తున్నామని చెప్పారు. వంద ఎకరాల్లో ఐకానిక్ బిల్డింగ్ వస్తుందని, దానిని చూసేందుకు అందరూ రావాలన్నారు. హైకోర్టు భవనం కూడా అలాగే అన్నారు.
అమరావతిలో ఆక్సిజన్ ఎక్కువ ఉండేలా గార్డెన్ రాజధానిగా నిర్మిస్తున్నామని అభిప్రాయపడ్డారు. అలా ఉంటే లైఫ్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్ హోదా అంటోందని, బీజేపీ ఎందుకు అమలు చేయడం లేదన్నారు. ఆస్తులు ఎలా పంచారు, అప్పులు ఎలా పంచారో.. అన్నింటిపై చర్చకు సిద్ధమన్నారు. నేను మోడీని వ్యక్తిగత డిమాండ్లు, పదవులు అడగలేదన్నారు. హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదన్నారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలన్నారు. కేంద్ర కేబినెట్లో ఏ శాఖ అడగలేదని, గవర్నర్, నామినేటెడ్ పోస్టులు అడగలేదన్నారు.
ఇదేం ప్రతిపక్షమో తెలియదు
ఈ రోజు అసెంబ్లీ జరుగుతుంటే ప్రతిపక్షం లేదని, అదేం ప్రతిపక్షమో తెలియడం లేదని చంద్రబాబు అన్నారు. హోదా కోసం కొందరు ఆవేదనతో ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. ఎవరూ హుందాతనం కోల్పోవద్దన్నారు. హుందాగా ఆందోళనలు చేద్దామని, మనకు న్యాయం జరగకుంటే ఎలా ముందుకు వెళ్లాలో అలా వెళ్దామన్నారు. ఇందులో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ అన్నారు.
మావి గొంతెమ్మ కోర్కెలు కాదు
తాను అయితే ఏపీ బాగుపడుతుందని ప్రజలు తనకు ఓటు వేశారని చంద్రబాబు చెప్పారు. కేంద్రం మాట నిలబెట్టుకోవాలని, పార్లమెంటులో చట్టం చేసిన తర్వాత కూడా అమలు చేయకపోవడం సరికాదన్నారు. తమవి గొంతెమ్మ కోర్కెలు కాదని, న్యాయమైన డిమాండ్లు అన్నారు. మనం (ఏపీ ప్రజలు) మన హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పారు.
ఎవరి పైనా కోపం లేదు
మాకు ఎవరి పైనా కోపం, బాధ, ఆవేదన లేదని చంద్రబాబు చెప్పారు. మాకు రావాల్సిన వాటి గురించి అడుగుతున్నామని చెప్పారు. మనం కష్టార్జితాన్ని వదులుకొని తాజా జీవితం ప్రారంభించామన్నారు. నేను అడిగేది న్యాయమా అన్యాయమా కాదా చెప్పాలని ఇక్కడున్న బీజేపీ నాయకులు (అసెంబ్లీలోని బీజేపీ వాళ్లు) చెప్పాలని ప్రశ్నించారు.
మనది ఇంకా ఫ్రెండ్లీ పార్టీ
దానికి విష్ణు కుమార్ రాజు స్పందిస్తూ.. సీఎం చంద్రబాబు రెండున్నర గంటలుగా మాట్లాడుతున్నారని, వారికి వెసులుబాటు కల్పించడం కోసం నేను నిలబడ్డానని, హోదా కోసం మేమిచ్చిన మేనిఫెస్టోలో పెట్టామని, రాజ్యసభలోను అడిగామని చెప్పారు. కానీ 14వ ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం ఏ రాష్ట్రానికి ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చిందన్నారు. ఆయన మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయగా.. మనం ఇంకా ప్రెండ్లీ పార్టీ అని, నేను చెప్పాక మాట్లాడాలన్నారు.
పదేళ్ల టైం ఉన్నా మూడున్నరేళ్లలో మెజార్టీ ఇచ్చాం
తాము ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని విష్ణు కుమార్ రాజు చెప్పారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీలో ఏది ఏపీకి న్యాయం జరుగుతుందో అది ఇస్తున్నామని, అలాంటప్పుడు అన్యాయం జరిగిందని అనుకోవద్దన్నారు. రైల్వే జోన్ మా కోరిక కూడా అని, అది వస్తుందన్నారు. విభజన చట్టంలోని పదేళ్లలోపు పూర్తిచేయాల్సి ఉందని, కానీ మూడున్నరేళ్లలో 85 శాతం వచ్చాయన్నారు. మీరు చెబితే మేం ఢిల్లీకి వెళ్లి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తామన్నారు.
ఒకవేళ పెండింగులో ఉంటే ఢిల్లీకి వెళ్లి మాట్లాడుతాం
నేను బీజేపీలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సెల్ మెంబర్ను అని, కాబట్టి తాను ఢిల్లీకి వెళ్లి మాట్లాడి తీసుకు వస్తానని విష్ణు కుమార్ రాజు చెప్పారు. రాష్ట్రానికి మేలు జరిగేలా కేంద్రం ప్యాకేజీ ఇచ్చిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బిల్లులు ఏవీ పెండింగులో లేవని చెప్పారు. ఒకవేళ పెండింగులో ఉంటే ఢిల్లీలో మాట్లాడి తీసుకు వస్తామన్నారు. టీడీపీ నేత పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. రావాల్సినవి ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీనే ఏపీ ప్రజలు మట్టి కరిపించారని, మీరు తీసుకు వస్తే బాగుంటుందన్నారు.
ఫోన్ చేసినా అన్యాయం
ఈ సందర్భంగా చంద్రబాబు కేంద్రానికి డెడ్ లైన్ విధించారు. మనం 18 డిమాండ్లు ముందుంచామని, వాటికి కేంద్రం పార్లమెంటు సమావేశాలయ్యేలోగా స్పష్టత ఇవ్వాలన్నారు. బడ్జెట్కు ముందు మోడీకి ఫోన్ చేసి చెప్పానని, అయినా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రయోజనాల కోసం ఓపిక, సంయమనం పాటిస్తూ వస్తున్నానని చెప్పారు. పురుడు పోసి తల్లిని చంపేశారని అప్పట్లో మోడీ అన్నారని చెప్పారు. ఆ విషయమే ఇప్పుడు అడిగానని చంద్రబాబు అన్నారు. మేం అధికారంలో ఉంటే రెండు (ఏపీ, తెలంగాణ)లను బతికి బట్ట కట్టనిచ్చేవాళ్లమని మోడీ చెప్పారని, ఇప్పుడు ఏం చేశారని నిలదీశారు.కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలన్నారు. డబ్బు కావాలంటే సంపాదించుకోవచ్చునని, ఆత్మాభిమానం దెబ్బతీస్తే ఊరుకోమని హెచ్చరించారు.