జగన్ పాలనలో చంద్రబాబు తొలి దీక్ష: ఇసుక కొరత పైన నిరసనగా :14న విజయవాడ కేంద్రంగా
ఏపీలో ఇసుక చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఇసుక సమస్య పైన ఫోకస్ చేసారు. గత వారం ఆయన తనయుడు లోకేశ్ గుంటూరులో ఇదే అంశం మీద దీక్ష చేసారు. ఇక, ఇప్పుడు తానే కార్యాచరణలోకి రావాలని చంద్రబాబు నిర్ణయించారు. అందు కోసం తొలుత దీక్షకు నిర్ణయించారు. ఈ నెల 14న విజయవాడలో ఇసుక సమస్య..ప్రభుత్వ వైఖరికి నిరసనగా 12 గంటల పాటు దీక్ష చేయనున్నట్లు చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేసారు.
ఈ దీక్ష్లలో రాష్ట్రా స్థాయి నేతలు పాల్గొంటారు. అదే విధంగా జిల్లాల స్థాయిలో కూడా పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించేలా టీడీపీ కార్యాచరణ సిద్దం చేస్తోంది. ఇక, పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి 15 రోజుల డెడ్ లైన్ విధించారు. ఆ తరువాత తన కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఇది తాత్కాలిక సమస్య అని.. త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పుకొచ్చారు.
ఇసుక కోసం చంద్రబాబు దీక్ష..
ఇసుక అంశంలో ఏపీలోని రాజకీయా పార్టీల నిరసనల్లో పోటీ పడుతున్నారు. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ దీని మీద విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించిన ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారు. ప్రభత్వానికి రెండు వారాల డెడ్ లైన్ విధించారు. ఆ సమయంలోగా సమస్య పరిష్కరించకుంటే కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేసారు. ఇక, బీజేపీ నేతలు సైతం సత్యాగ్రహం పేరుతో ఆందోళన నిర్వహిస్తోంది. గత వారం టీడీపీ నేత లోకేశ్ గుంటూరులో ఇసుక సమస్య పైన దీక్ష చేసారు. ఇక, ఇప్పుడు రాష్ట్రంలో ఇసుక సమస్య తీవ్రంగా ఉండటం.. భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నిరసనలకు సిద్దం కావాలని నిర్ణయించారు. అందులో భాగంగా.. ప్రతిపక్ష నేత హోదాలో ప్రభుత్వీ తీరును నిరసిస్తూ దీక్ష చేయాలని నిర్ణయించారు. అందుకోసం వేదిక..ముహూర్తం సైతం ఖరారు చేసారు. ఈ నెల 15న మంగళగిరి వద్ద పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
14న విజయవాడలో ..12 గంటల పాటు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇసుక సమస్య పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసన వ్యక్తం చేస్తూ 12 గంటల దీక్షకు సిద్దమయ్యారు. ఈ నెల 14న విజయవాడలో ఈ దీక్ష చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అనేక మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకోవటం పైన చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. పార్టీ తరపున కొంత మంది ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఆర్దిక సాయం చేసారు. ఇసుక సమస్య పైన పోరాటం విషయంలో కలిసి రావాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి కోరగానే..చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. మాజీ మంత్రులు మార్చ్ లో పాల్గొంటారని హామీ ఇచ్చారు. అదే విధంగా గంటా మినహా అయ్యన్న పాత్రుడు..అచ్చెన్నాయుడు ఆ మార్చ్ లో పాల్గొన్నారు. ఈ దీక్ష ద్వారా ఏపీ ప్రభుత్వం ఇసుక సమస్య పరిష్కారంలో వైఫల్యం చెందిందని.. ప్రభుత్వ తీరు కారణంగానే భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని..వారికి పరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు.
తాత్కాలిక సమస్య అంటున్న సీఎం..
ఏపీలో రాజకీయ పార్టీలు ఇసుక సమస్య మీద పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంటే..ముఖ్యమంత్రి దీనిని తాత్కాలిక సమస్యగా అభివర్ణించారు. వరద కారణంగానే ఇసుక సమస్య ఏర్పడిందని.. వరద తగ్గగానే ఇసుక సమస్య తీరుతుందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. 90 రోజులుగా ఊహించని రీతిలో వరద వస్తోందని వివరించారు. రాష్ట్రంలో 265కిపైగా రీచ్ల్లో కేవలం 61 మాత్రమే పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. మిగతా రీచ్లన్నీ వరదనీటిలో ఉన్నాయన్నారు. అక్కడ నుంచి ఇసుక తీయడం కష్టంగా ఉంది, లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. 90 రోజులుగా కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి చివరకు పెన్నా నదిలో కూడా వరద వస్తోందని ముఖ్యమంత్రి విశ్లేషించారు. ప్రాధాన్యతా రంగాలకు ఇసుక ఇవ్వడానికి వెంటనే ప్రత్యేక స్టాక్యార్డులు కూడా ఇస్తామని సీఎం చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు దీక్షకు నిర్ణయించటంతో..అధికార పార్టీ నేతలు ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.