చంద్రబాబు షాకింగ్ డెసిషన్: రెబల్ ఎమ్మెల్యేలకు ట్రాప్..అంబానీకి మెసేజ్: రాజ్యసభ బరిలో టీడీపీ..!
అమరావతి: స్థానిక ఎన్నికల వేళ..చంద్రబాబు షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. టీడీపీ నుండి వరుసగా నేతలు వైసీపీ లో చేరుతుండగా..చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయం ప్రకటించారు. ప్రస్తుతం ఏపీ నుండి నాలుగు రాజ్యసభ సీట్ల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార వైసీపీ అసెంబ్లీలో ఉన్న బలంతో నలుగురు అభ్యర్ధులను దక్కించుకోనుంది. ఇప్పటికే నలుగురు అభ్యర్ధులను ప్రకటించింది. అయితే, సడన్ గా చంద్రబాబు సభలో బలం లేకపోయినా..తామూ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించారు. తమ పార్టీ నుండి పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య బరిలో ఉంటారని ప్రకటించారు.
చంద్రబాబు వ్యూహాత్మక ఎత్తుగడ
రాజ్యసభ ఎన్నికల్లో వర్లరామయ్యను పోటీలో నిలుపుతామని చెప్పిన చంద్రబాబు... పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేస్తామని..ఉల్లంఘిస్తే అనర్హత కు గురవుతారని హెచ్చరించారు. దీంతో..టీడీపీ నుండి వైసీపీకి దగ్గరైన ఇద్దరు ఎమ్మెల్యేలను ట్రాప్ చేసేందుకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో తన మిత్రుడు అంబానీ..ఈ సారి వైసీపీ నుండి తన మిత్రుడు నత్వానీని రాజ్యసభకు పంపుతున్న సమయంలో ఏకగ్రీవానికి అవకాశం లేకుండా..పోటీ పెట్టటం ద్వారా తాను చెప్పదలచుకున్నది చంద్రబాబు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
రాజ్యసభ ఎన్నికల బరిలో టీడీపీ...
ప్రస్తుత శాసనసభలో టీడీపీకి 23 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. వైసీపీకి 151 మంది సభ్యుల బలం ఉంది. ఏపీ నుండి ఎన్నికలు జరుగుతున్న నాలుగు స్థానాలకు వైసీపీ దక్కించుకోవటం ఖాయం. ఇప్పటికే ఇద్దరు మంత్రులతో పాటుగా అంబానీ సూచన మేరకు పరిమళ్ నత్వానీ అదే విధంగా అయోధ్య రామిరెడ్డి పేర్లను వైసీపీ ప్రకటించింది. ఆ నలుగురు బుధవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇదే సమయంలో టీడీపీ నుండి పలువురు నేతలు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైసీపీలో చేరుతున్నారు. మరి కొంత మందిని చేర్చుకోవటం ద్వారా టీడీపీ కింది స్థాయి కేడర్ ఆత్మవిశ్వాసం దెబ్బ తీసేలా వైసీపీ మైండ్ గేమ్ కొనసాగిస్తోంది. దీంతో..తమ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలను ట్రాప్ చేసేందుకు.. ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా..పోలింగ్ జరిగేలా చూడాలని చంద్రబాబు నిర్ణయించారు. దీంతో..ఈ మేరకు ఆయన కీలక ప్రకటన చేశారు.
అభ్యర్ధిగా వర్ల రామయ్య..ఆ ఇద్దరు ఎమ్మెల్యేలే టార్గెట్
తగిన బలం లేకపోయినా..టీడీపీ నుండి రాజ్యసభ అభ్యర్ధిని చంద్రబాబు ప్రకటించారు. రాజ్యసభకు వర్ల రామయ్యను అభ్యర్థి గా పోటీలో పెడుతున్నట్లు ప్రకటన చేశారు. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఆలోచించాలని.. తాము తప్పు చేస్తున్నారో.. ఒప్పు చేస్తున్నారో తేల్చుకోవాలని చంద్రబాబు సూచించారు. తాము చేసేది తప్పని భావిస్తే వర్లకు ఓటెయ్యాలని కోరారు. తప్పని తెలిసినా భయపడితే వైసీపీ అభ్యర్థులకు ఓటేస్తారంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యే లందరికి విప్ జారీ చేస్తామని ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు పార్టీ ఏజెంట్ కి చూపించి వేయాలని గుర్తు చేసారు. దీనిని ఉల్లంఘిస్తే అనర్హత కు గురవుతారంటూ హెచ్చరించారు. దీని ద్వారా టీడీపీ నుండి గెలిచి వైసీపీకి అనుబంధంగా కొనసాగుతున్న వల్లభనేని వంశీ..మద్దాలి గిరి లే లక్ష్యంగా చంద్రబాబు ఈ ప్రణాళిక సిద్దం చేసినట్లు కనిపిస్తోంది. అయితే, వైసీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవటం పైన భిన్న వాదనలు వినినిస్తున్నాయి.
అంబానీ కి మెసేజ్ ఇచ్చారా..
తొలి నుండి చంద్రబాబు..అంబానీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే, గత నెలలో ముఖేష్ అంబానీ సీఎం జగన్ నివాసానికి వచ్చి తన సన్నిహితుడు పరిమళ్ నత్వానీకి రాజ్యసభ ఇవ్వాలని అభ్యర్ధించారు. ఈ మేరకు జగన్ సైతం నత్వానీకి రాజ్యసభ ఖరారు చేశారు. ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. నత్వానీకి ఏ కోటాలో సీటు ఇచ్చారో..ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో చెప్పాలంటూ వైసీపీ ని డిమాండ్ చేశారు. ఈ రోజు తమ అభ్యర్ధిని బరిలో దించటం ద్వారా.. నత్వానీతో సహా వైసీపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాకుండా..పోలింగ్ అనివార్యం అయ్యేలా చంద్రబాబు కొత్త ఎత్తుగడ వేశారు. దీని ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సైతం నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, తాము గెలుస్తామని కాదని..ప్రభుత్వ ఆగడాలు తెలియటానికే అని చంద్రబాబు ముందుగానే ఫలితం ఏంటో చెప్పకనే చెప్పేశారు. ఇక, ఇప్పుడు చంద్రబాబు తాజా నిర్ణయం పైన వైసీపీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.