పుల్వామా-ఇమ్రాన్ఖాన్ ఎఫెక్ట్: ఆధారాలు చూపిస్తావా, సారీ చెప్తావా... అమిత్ షాపై బాబు నిప్పులు
అమరావతి: పుల్వామా ఉగ్రవాద దాడికి, పాకిస్థాన్కు సంబంధం లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ఖాన్ చెబుతుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దానికి మద్దతు పలుకుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గురువారం మండిపడ్డారు. దీనిపై చంద్రబాబు శుక్రవారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
చింతమనేని వీడియో: చప్పట్లు ఎలా కొట్టారు.. సూపర్ లాజిక్ లాగిన నారా లోకేష్!
ఇమ్రాన్ ఖాన్కు మద్దతు పలికానా.. ఆధారాలు చూపండి లేకుంటే
పాకిస్తాన్కు తాను వత్తాసు పలుకుతున్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. లేదంటే అమిత్ షా క్షమాపణలు చెప్పాలన్నారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ను తాను విశ్వసిస్తున్నానని అమిత్ షా చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. సైనికుల చావులను కూడా రాజీకయం చేస్తున్నానని తనపై అనడం సిగ్గుచేటు అన్నారు. బీజేపీ నీచ రాజకీయాలు చేస్తూ తనపై బురద చల్లాలని చూస్తోందని మండిపడ్డారు.
ఉగ్రవాదులకు హవాలా డబ్బు ఎలా అందుతోంది
ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే పుల్వామా ఉగ్రదాడి జరిగిందని చంద్రబాబు అన్నారు. 2013లో బీహార్, కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులకు బాధ్యత వహిస్తూ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని నరేంద్ర మోడీ అప్పుడు కోరలేదా అని ప్రశ్నించారు. దేశ భద్రత ప్రధాని చేతుల్లో ఉన్నప్పుడు ఉగ్రవాదులకు హవాలా డబ్బులు ఎలా అందుతున్నాయో చెప్పాలన్నారు. ఉగ్రవాదులను నిలువరించే నిగ్రహం ప్రధానికి లేదా అని మండిపడ్డారు. సైన్యం మీ చేతుల్లో ఉందని, అలాంటప్పుడు ఉగ్రవాద దాడులు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించారు. చంద్రబాబు అంతకుముందు మాట్లాడుతూ... కుట్రలు, కుతంత్రాలు చేయడంలో మోడీ- అమిత్ షాలది బ్రహ్మాoడమైన జోడీ అని విమర్శించారు. అమిత్ షా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఏ మాత్రం కనువిప్పు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. మనల్ని ఇంకా బాధ పెట్టాలనే పైశాచికత్వం వారిలో ఉందని, ఇది దుర్మార్గమైన చర్య అన్నారు. హవాలా సొమ్ములు తెచ్చేందుకే జగన్ విదేశీ పర్యటన చేస్తున్నారన్నారు. డబ్బుల కోసమే జగన్ లండన్ పర్యటన అన్నారు. ఎన్నికల ముందు ఎవరూ విదేశీ పర్యటనలకు వెళ్లరని, జగన్ ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు.
అమిత్ షా ఏమన్నారంటే
కాగా, గురువారం ఏపీ పర్యటన సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ... చంద్రబాబుకు పక్క దేశ ప్రధాని మీద ఉన్న నమ్మకం మన ప్రధానిపై లేదని, తమ (బీజేపీ) రక్తంలో దేశభక్తి ఉందని, ఈ విషయంలో తమల్ని విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదని, తాము అధికారాన్ని చేపట్టిన అనంతరం దేశ రక్షణకు ప్రాధాన్యం ఇచ్చామని, గతంలో జరిగిన ఉగ్రదాడులను సమర్థంగా తిప్పికొట్టామని, ఆయా రాష్ట్రాలకు వెళ్లి దీక్షలు చేయడంపై దృష్టి పెడుతున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మీద మాత్రం దృష్టి పెట్టడం లేదన్నారు.