దేవాలయాల్లో ఘటనలపై జగన్ నిర్లక్ష్యం- సీబీఐ విచారణకు చంద్రబాబు డిమాండ్..
ఏపీలో గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవాలయాల్లో జరుగుతున్న వరుస ఘటనలపై విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తొలి ఘటన చోటు చేసుకున్నప్పుడే సీఎం జగన్ బయటికొచ్చి స్పందించి ఉంటే పరిస్ధితి ఇంతవరకూ వచ్చేది కాదన్నారు. దేవాలయాల్లో ఘటనల్లో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇప్పటివరకూ జరిగిన అన్ని ఘటనలపైనా సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు.
కోడెల వర్ధంతి .. పల్నాటి పులి అన్న చంద్రబాబు.. పొలిటికల్ డాక్టర్ అంటూ లోకేష్ ట్వీట్
రాష్ట్రంలో ఏం జరుగుతోంది ?
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ దేవాలయాల్లో దాడులు, భూముల ఆక్రమణలు, ఆస్తుల కబ్జాలు, రధాల దగ్ధాలు, విగ్రహాల ధ్వంసం, గోవుల మృతి ఘటనలు అన్నీ కలిపి దాదాపు 80 ఘటనలు చోటు చేసుకున్నాయని విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తాజాగా చోటు చేసుకున్న అంతర్వేది, విజయవాడ కనకదుర్గ రధంపై వెండి సింహాల మాయం వంటి ఘటనలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. దుర్గమ్మ రథంపై వెండి సింహాలు మాయమైతే ఈవో ఇంకా చూస్తున్నాం, పరిశీలిస్తున్నాం అంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గమ్మ రథంపై నాలుగో సింహం కూడా పీకేందుకు ప్రయత్నించి రాకపోతే వదిలేశారని ఆయన పేర్కొన్నారు. ఇవాళ కూడా విజయవాడలో సాయిబాబా విగ్రహం ధ్వంసం అయిందని, వీటికి ఎప్పుడు ఫుల్స్టాప్ పడుతుందని చంద్రబాబు ప్రశ్నించారు.
జగన్, మంత్రులకు లెక్కలేదు...
రాష్ట్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పలు ఘటనలు జరుగుతున్నా సీఎం జగన్ కానీ, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తాజాగా విజయవాడలో దేవాదాయమంత్రి నియోజకవర్గంలోనే దుర్గమ్మ రథంపై వెండి సింహాలు ఎత్తుకెళ్లిన ఘటన జరిగిందిని, దీనిపై ఆయనేం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సీసీ కెమెరాల్లో ఫుటేజ్ కూడా లేకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దుర్గమ్మ రథంపై సింహాల చోరీ ఘటన నిన్న తెలిస్తే ఇప్పటివరకూ ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనపై దేవాదాయమంత్రి ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు.
ప్రశ్నిస్తే ఎదురుదాడులేనా ?
రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో లెక్కలేనన్ని ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పిఠాపురం ఆలయంలో విగ్రహాల ధ్వంసంతో ప్రారంభిస్తే టీడీడీ, శ్రీశైలం, సింహాచలం, అంతర్వేది దేవాలయాల్లో పలు అక్రమాలు జరిగాయని, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయని చంద్రబాబు గుర్తుచేశారు. వీటిపై ఎప్పటికప్పుడు టీడీపీ ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం ఎదురుదాడితో కాలక్షేపం చేస్తోందని ఆరోపించారు.
ఏం చేసినా భక్తులు, ప్రజలేం మాట్లాడలేరనే పరిస్ధితికి వచ్చారన్నారు. ఇవన్నీ చూస్తూ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని చంద్రబాబు జగన్ను ప్రశ్నించారు. ఇలాంటి పరిస్ధితి కుదరని సీఎంను హెచ్చరిస్తున్నా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతుంటే సీఎంకు బాధ్యత లేదా, అసలు పాలించే అర్హత ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు. మతసామరస్యాన్ని కాపాడాలని, దేవాలయాలపై దాడులు ఆపాలని టీడీపీ వారం రోజుల కార్యక్రమం చేపట్టిందని, ప్రజల్లో చైతన్యం తెస్తాం, ప్రజల మనోభావాల్ని, నమ్మకాల్ని కాపాడతాం అని చంద్రబాబు తెలిపారు.
Recommended Video
సీబీఐ విచారణకు డిమాండ్...
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని దేవాలయాల్లో ఇప్పటివరకూ జరిగిన అన్ని ఘటనలపైనా సీబీఐ విచారణ జరిపిస్తేనే నిజానిజాలు బయటికొస్తాయని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం తక్షణం అన్ని ఘటనలపైనా సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. అలాగే తాజాగా దుర్గమ్మ రథంపై వెండి సింహాల మాయం ఘటనలో ఈవోను సస్పెండ్ చేయడంతో పాటు దేవాదాయమంత్రిని డిస్మిస్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీడీలో శేఖర్రెడ్డిపై గతంలో ఆరోపణలు చేసి తిరిగి అధికారంలోకి రాగానే పెద్దపీట వేశారని చంద్రబాబు గుర్తుచేశారు. టీటీడీ డైరీల ముద్రణ ఎందుకు తగ్గించారు, తప్పులు ముద్రిస్తున్నారు. తిరుమలలో వస్త్రాల మార్పిడి సంప్రదాయం మార్చేశారన్నారు. సాంప్రదాయాలకు విరుద్ధంగా టీడీడీ ఛైర్మన్ వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. ఎస్వీబీసీ ఛైర్మన్ లైంగిక ఆరోపణలతో పదవి వదులుకోవాల్సి వచ్చిందన్నారు. వైఎస్ హయాంలో అపచారం జరిగిందంటే ఏడు కొండలెక్కి ప్రజల్లో చైతన్యం తెచ్చానని చంద్రబాబు తెలిపారు.