భార్యాభర్తల కాపురానికీ కెసిఆర్ అనుమతి కావాలేమో: బాబు వ్యంగ్యం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యంగ్యాస్త్రాలు విసిరారు.చంద్రబాబునాయుడు మంగళవారం సాయంత్రం మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ప్రతిపక్షాలు ప్రతీ విషయాన్ని రాజకీయం చేయాలనుకుంటున్నాయని, తాను మౌనంగా ఉంటే బలహీనతగా భావించే ప్రమాదముందని సభలో కాస్త ఘాటుగా స్పందించానని చంద్రబాబు చెప్పారు.
పట్టిసీమ గురించి ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావించగా... ''పట్టిసీమ వివరాలు మీడియాకు అందజేస్తాను. ప్రస్తుత రేట్ల ప్రకారమే జగన్కు ఇస్తే చేపడతారా?" అని చంద్రబాబు అన్నారు. పోలవరం పూర్తవడానికి నాలుగేళ్లు పడుతుందని అంటూ ఈలోగా రాయలసీమకు నీళ్లిస్తే జగన్కు బాధ ఎందుకు? అని ప్రశ్నించారు. రాయలసీమకు నీళ్లు రాకుంటే బాంబుల సంస్కృతి వస్తుందని, జగన్ బాంబుల సంస్కృతి కోరుకుంటున్నారా? అని చంద్రబాబు అన్నారు
తన రాజకీయ అనుభవమంత వయసు కూడా జగన్కు లేదన్నారు. ''కొన్ని విషయాల్లో జగన్కు సమాధానం చెప్పాల్సిన అవసరంలేదు. అయినా సమాధానాలు చెబుతున్నాం. జగన్మోహన్రెడ్డిగారు అని నేను సంభోదిస్తుంటే.. ఆయన ఏకవచనంతో మాట్లాడుతున్నారు.'' అని చంద్రబాబు అన్నారు. పట్టిసీమపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... పట్టిసీమతో కేసీఆర్కు ఏం సంబంధం? అని పశ్నించారు.
ప్రాణహితకు ఏపీ అనుమతి అవసరం లేదు కదా...వాళ్లది వాళ్లదే..మాది మాదే అని...చివరికి భార్యాభర్తల కాపురానికీ కేసీఆర్ అనుమతి కావాలేమో అని చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.