పోలీసులతో చంద్రబాబు వాగ్వాదం .. 14 ఏళ్ళు సీఎంగా పని చేశా .. తమాషాగా ఉందా అంటూ ఫైర్
చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా, దీక్షలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు రేణిగుంట ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న అనంతరం పోలీసులు ఆయనను ఎయిర్ పోర్టు నుండి బయటకు వెళ్ళకుండా నిలువరించారు. చిత్తూరు వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పడంతో చంద్రబాబు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై మండిపడ్డారు. ఏం తమాషాగా ఉందా అంటూ ఫైర్ అయ్యారు.
దీక్షకు అనుమతి లేకపోతే జిల్లా ఎస్పీ కలెక్టర్ ను కలిసేందుకు వెళ్తానని, ప్రజాస్వామ్యంలో తనకు ఆ హక్కు లేదా అంటూ పోలీసులపై మండిపడ్డారు.
రేణిగుంట ఎయిర్పోర్టులో చంద్రబాబు నిర్బంధం: ఎయిర్ పోర్ట్ లో బాబు నిరసన,ఉద్రిక్తత
14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తిని ఈ విధంగా అడ్డుకోవడం ఏమిటి అని చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసులు తనను బయటకు వెళ్లడానికి అనుమతించాలని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో ప్రతిపక్ష నాయకుడిని అదుపులోకి తీసుకోవడానికి ఎవరు ఆదేశం ఇచ్చారని చంద్రబాబు పోలీసు అధికారులను ప్రశ్నించారు. ధర్నాకు హాజరు కావడానికి అనుమతి కోరేందుకు జిల్లా ఎస్పీని కలుస్తామని , అందుకే వెళ్తున్నానని పోలీసులతో చెప్పారు. పోలీసులు చంద్రబాబుని శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నా ఆయన మాత్రం పోలీసులపై మండిపడుతున్నారు.
చంద్రబాబుని అనునయించే ప్రయత్నం చేస్తున్న పోలీసులు చిత్తూరు జిల్లా కలెక్టర్ ను, ఎస్పీని ఎయిర్ పోర్ట్ దగ్గరకు పిలుస్తామని, వారితో అక్కడే మాట్లాడొచ్చని చెప్పినా చంద్రబాబు అంగీకరించలేదు. తాను అంత గొప్ప వాడిని కాదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనను అడ్డుకొని తగిన గౌరవం ఇచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రస్తుతం రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు ఒక్కరే ఉన్నారు. ఆయన వెంట ఇతర నేతలెవరూ లేరు. మరోపక్క టిడిపి కార్యకర్తలు చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.