ఢిల్లీకి వెళ్తే ఏమన్నారంటే: కత్తి దాడిపై 23 రోజుల తర్వాత జగన్ మాట్లాడటంపై బాబు, దేవినేని
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై శనివారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆదివారం మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వర రావులు ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో తనపై దాడి జరిగిన ఇరవై మూడు రోజుల తర్వాత జగన్ మాట్లాడటం విడ్డూరమన్నారు.
కాంగ్రెస్తో పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, కేసీఆర్-పవన్ కళ్యాణ్లపై ఆగ్రహం
ఈ విషయంలో సీఎం చంద్రబాబుపై విమర్శలు సరికాదన్నారు. తనపై కుట్ర పన్నారని చంద్రబాబును, డీజీపీలను ఏ1, ఏ2లుగా చెప్పడం దారుణం అన్నారు. జగన్ కేసు విషయంలో పోలీసు విచారణ జరుగుతోందని చెప్పారు. దాడి జరిగిన వెంటనే జగన్ పోలీసులకు సహకరించలేదన్నారు.
23 రోజుల తర్వాత జగన్ స్పందిస్తారా?
ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత థర్డ్ పార్టీ విచారణ జరపాలనడం దారుణమని దేవినేని అన్నారు. జగన్ నుంచి వివరాలు సేకరించేందుకు పోలీసులు పలుసార్లు ప్రయత్నించినా నిరాకరించారని, దానికి సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇప్పటికైనా రక్తపు మరకలు పడిన చొక్కాను పోలీసులకు ఇచ్చి, సహకరించాలని కోరారు. జగన్ మానసిక వ్యాధితో మాట్లాడుతున్నారన్నారు. ఏపీ పోలీసులపై జగన్కు నమ్మకం లేదని, బాధ్యతలను విస్మరించి మాట్లాడటం సరికాదన్నారు.
కోడి కత్తి కేసుతో ఢిల్లీకి వెళ్తే ఏమన్నారంటే?
జగన్ కోడి కత్తి నాటకం తొందరలోనే బయటపడుతుందని దేవినేని అన్నారు. జగన్ అవినీతిలో కూరుకుపోయి తమపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. ఓవైపు రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతుంటే, మరోవైపు జగన్ విమర్శలు చేయడం దారుణం అన్నారు. వైసీపీ ఎంపీలు కోడి కత్తి కేసుపో ఢిల్లీకి వెళ్తే పెట్టీ కేసు పట్టుకొని వచ్చారని అడగలేదా అని ప్రశ్నించారు. జగన్ సీఎం అయిపోయాననే భావన నుంచి బయటకు రావాలన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదన్నారు.
డ్రామా అని అర్థమైంది
కోడి కత్తి డ్రామా జరిగిన ఇరవై రోజుల తర్వాత జగన్ మాట్లాడుతున్నారని చినరాజప్ప అన్నారు. వైసీపీ కోడి కత్తి డ్రామా ప్రజలకు అర్థమైపోయిందని చెప్పారు. సిట్ నివేదిక వచ్చిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. ప్రజలు అసహ్యించుకునేలా వైసీపీ నేతల ఆరోపణలు ఉన్నాయని చెప్పారు.
అది వృథా ప్రయాస
శనివారం క్రైస్తవ సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. కోడికత్తి డ్రామాను ప్రజలు నమ్మనందుకే జగన్ తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. జగన్ నిన్నటి వరకు మౌనంగా ఉన్నారని, కోడి కత్తి డ్రామాను ప్రజలు నమ్మలేదని, తల్లిద్వారా చెప్పించారని, కోర్టుకి వెళ్లారని, ఆధారాలు ఇస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని నేను అంటే, తనపై ఆరోపణలు చేస్తున్నారని, తమపై ఆరోపణతో రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవడం వృథా ప్రయాస అన్నారు.
నేను హత్యా రాజకీయాలకు దూరం
జగన్ అభిమానే ఆయనపై దాడి చేశాడని, ఆ విషయాన్ని దాడి చేసిన వ్యక్తే చెప్పాడని, కానీ జగన్ తనపై ఆరోపణలు చేస్తున్నారని, తాను రాజకీయంగా పోరాడతానే తప్ప, హత్యా రాజకీయాలకు దూరమని, హత్యకు హత్య సమాధానం కాదని గట్టిగా నమ్ముతానని చంద్రబాబు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ తలుచుకుంటే రెండు నిమిషాల్లో జైలుకి పోతానన్న పిరికితనంతోనే జగన్ కేంద్రాన్ని పల్లెత్తు మాట అనడం లేదని ఆరోపించారు. తప్పులు చేసినవాళ్లే మోడీని చూసి భయపడతారన్నారు. మనం భయపడాల్సిన అవసరం లేదన్నారు. జగన్ తల్లి విజయమ్మ బైబిల్ పట్టుకుని తిరుగుతుంటే, కొడుకు బీజేపీతో అంటకాగుతున్నారని, అలాంటి నాటకాలు టీడీపీకి సాధ్యం కాదని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు.