జగన్తో పాదయాత్ర చేస్తే వాస్తవాలు తేలుతాయి: బాబుకు రోజా సవాల్
వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై శుక్రవారంనాడు తీవ్ర విమర్శలు చేశారు.
అమరావతి: వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై శుక్రవారంనాడు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకోవాలన్న ఆకాంక్ష, తపన కారణంగానే తమ పార్టీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తున్నారని రోజా చెప్పారు.
Recommended Video
అయితే వైఎస్ జగన్ పాదయాత్రను చూసి తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర భయాందోళన చెందుతున్నారని రోజా విమర్శించారు. ఏ సమస్య లేదని చంద్రబాబు చెప్పడాన్ని రోజా తప్పుబట్టారు.
రుణమాఫీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చానని, ఎస్సీఎస్టీలకు భూములు పెన్షన్లు ఇచ్చానని అందరికీ అన్నీ చేశానని చెప్పడాన్ని ప్రస్తావిస్తూ హెలోజినేషన్ ఆరవ దశలో కూడ చేయనివన్నీ చేసినట్టుగా అనిపిస్తుందన్నారు.
చంద్రబాబుకు కూడ ఇప్పుడదే జబ్బు పట్టుకుందని రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏం చేయని చంద్రబాబు అన్నీ చేసినట్టు చెప్పుకుంటున్నారని రోజా విమర్శలు చేశారు. చంద్రబాబుకు ధైర్యముంటే జగన్ తో పాటు నడిచి ఏ గ్రామంలో ఏ అభివృద్ధి జరిగిందో చూపించాలని రోజా సవాల్ విసిరారు.
ఎక్కడైనా రోడ్లు, డ్రైనేజీలు సక్రమంగా ఉన్నాయా? అని ఆమె ప్రశ్నించారు. ఈ మూడేళ్లలో ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం వచ్చిందా? డ్వాక్రా మహిళకు రుణమాఫీ జరిగిందా? అని నిప్పులు చెరిగారు.
ఓటుకు కోట్లు కేసులో తెలంగాణలో అరెస్ట్ చేస్తారన్న భయంతోనే హైదరాబాద్ ను వదిలి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబేనని వైకాపా ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తమ అధినేత జగన్ను విమర్శించే హక్కు లేదన్నారు.
వైకాపా ఎమ్మెల్యేలను అడ్డంగా కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా బడ్జెట్ సెషన్ ను కేవలం 13 రోజులే పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చెప్పారు. తాను ప్రతిపక్షంలో ఉన్న వేళ, 80 రోజులు అసెంబ్లీ పెట్టాలని డిమాండ్ చేసిన బాబు, అధికారంలోకి వచ్చాక అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.