చంద్రబాబు ఎంపీలకు పవర్ ఇవ్వలేదు:జేసీ;మోహన్ బాబుతో విజయసాయిరెడ్డి భేటీ
అనంతపురం:చంద్రబాబుపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నా...2019 ఎన్నికల్లో మళ్లీ గెలవాలన్నా 40 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని ఎంపి జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలను మార్చకుంటే పరిస్థితి కష్టంగా ఉంటుందని ఎంపి జెసి దివాకర్ రెడ్డి విశ్లేషించారు. అంతేకాదు రాష్ట్రంలో ఎంపీలకు ఎటువంటి పవర్ లేకుండా పోయిందని ఎంపి జెసి దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఎంపీలకు ఉండాల్సిన పవర్ కూడా సిఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకే కట్టబెట్టారని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఎవరికైనా రేషన్కార్డు, పింఛను, ఇంటి పట్టా ఏది కావాలన్నా ఎమ్మెల్యేలకు చెబితేనే పనులు అవుతున్నాయని...తాము చెబితే ఎవరూ పట్టించుకోవడం లేదని జేసీ దివాకరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా జిల్లాలో తాగు నీరు, సాగునీరు ఇబ్బందులు ఉన్నాయన్నారు. పీఏబీఆర్ ఎగువన 29 వేల ఎకరాల్లో అనధికార ఆయకట్టును సాగు చేస్తున్నారని చెప్పారు.
మరోవైపు ప్రముఖ సినీనటుడు మోహన్బాబుతో శనివారం సాయంత్రం వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి భేటీ కావడం తెలుగు రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ భేటీలో వైసిపి ఎంపి విజయసాయి రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కూడా పాల్గొన్నారు. మోహనబాబు స్వస్థలం చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లిన వైసిపి నేతలు ముందుగా ఇటీవల మృతి చెందిన మోహన్బాబు తల్లి మంచు లక్ష్మమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించి అనంతరం మోహన్బాబును పరామర్శించారు.
అయితే మోహన్ బాబు ఇక్కడ ఉన్నారని తెలిసి పరామర్శించేందుకు వచ్చామే తప్ప తమ మధ్య భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యంలేదని వైసిపి నేతలు చెబుతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో రాజకీయాల గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదని వారు అంటున్నట్లు తెలిసింది.
అంతకుముందు తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని వైసీపీ కార్యాలయంలో తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో ఆయన సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లనూ గెలుచుకునేందుకు అవసరమైన వ్యూహాలతో సిద్ధం కావాలని సూచించారు.