బలవంతపు ఏకగ్రీవాలు జరగనివ్వొద్దు .. పంచాయతీ పోరు కోసం టీడీపీ కంట్రోల్ రూమ్ : చంద్రబాబు
బలవంతపు ఏకగ్రీవాలు జరగనివ్వొద్దని, స్వేచ్ఛగా ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో అన్ని గ్రామాల్లోని అభ్యర్థులు ధైర్యంగా, స్వేచ్ఛగా నామినేషన్లు వేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నామినేషన్ల స్వీకరణ తొలిరోజు సాధ్యమైనంత ఎక్కువగా నామినేషన్లు దాఖలు చేయాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు.
సీఎం జగన్ పై చంద్రబాబు ధ్వజం .. నేరస్థులు సీఎం అయితే కోర్టులనే బెదిరిస్తారని ఆగ్రహం
బలవంతపు ఏకగ్రీవాలు చేయాలని చూస్తే వైసీపీకి బుద్ధి చెప్పండి
ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటుందని, విధ్వంసాలకు గురి చేసే ప్రమాదం కూడా పొంచి ఉందని, ఎవరూ భయపడకుండా వీరోచితంగా ఎదుర్కోవాలని, వైసిపి విధ్వంసకాండ పై పోరాటం చేయాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు.
రాజ్యాంగానికి తూట్లు పొడిచి హింస దౌర్జన్యాలతో బలవంతపు ఏకగ్రీవాలు చేయాలని చూస్తే వైసీపీకి బుద్ధి చెప్పాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థలు ఎన్నికల పట్ల చాలా నిక్కచ్చిగా ఉన్నాయని పేర్కొన్న చంద్రబాబు ఎవరు ఎలాంటి భయానికి గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
వైసిపి నాయకులు ఘర్షణకు దిగితే ఫోటోలు , వీడియోలతో ఫిర్యాదులు చెయ్యండి
అభ్యర్థులంతా అవసరమైన ధృవీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. నామినేషన్ల దాఖలులో సాంకేతిక అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాటిని తర్వాత కూడా పరిష్కరించుకోవచ్చు అన్నారు. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఆన్లైన్ లో నో డ్యూ సర్టిఫికెట్ పొందేలా వీలు కల్పించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి పంపామన్నారు చంద్రబాబు.
ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అలర్ట్ గా ఉండాలని, వైసిపి నాయకులు ఘర్షణకు దిగితే ఫోటోలు , వీడియో సాక్ష్యాధారాలను సేకరించి, ఆధారాలతో సహా లిఖితపూర్వక ఫిర్యాదు లను రిటర్నింగ్ అధికారులకు ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు.
ఎన్నికల సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు పనిచేసే విధంగా టీడీపీ కంట్రోల్ రూమ్
సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకోవాలని, పార్టీ కార్యాలయానికి సైతం పంపి కావలసిన సహాయ, సహకారాలను పొందాలని చంద్రబాబు తెలిపారు.
ఎన్నికల్లో ఎదురయ్యే ఇబ్బందులపై సమాచారాన్ని అందించడం కోసం 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని, ఎవరికైనా ఎలాంటి ఎన్నికల సమాచారం కావాలన్నా లీగల్ సెల్ న్యాయవాదులు అంతా సిద్ధంగా ఉన్నారని, వారి సలహాలు, సూచనల మేరకు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చెయ్యాలని చంద్రబాబు తెలిపారు.
జగన్ రెడ్డి పాలనపై ప్రజల్లో విముఖత ఉంది .. ప్రజల్లోకి వెళ్ళండి
జగన్ రెడ్డి పాలన పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, గ్రామాలలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయని పేర్కొన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా చేసింది శూన్యం అని పేర్కొన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం పై దాడి నేపధ్యంలో ఏపీ లో రాజ్యాంగ సంక్షోభం పై దేశవ్యాప్తంగా చర్చ జరిగిందని ,రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేశాయని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ పాలన పై ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని పార్టీ అభ్యర్థులు దూసుకుపోవాలని పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
Recommended Video