టీటీడీపీకి చంద్రబాబు డైరెక్షన్స్.. ముద్రగడతో ఎమ్మెల్యే ఆకుల భేటి
హైదరాబాద్ : టీటీడీపీ నేతలకు డైరెక్షన్స్ ఇచ్చారు ఏపీ సీఏం చంద్రబాబు నాయుడు. తెలంగాణలో కొన ఊపిరితో ఉన్న పార్టీని తిరిగి ఫామ్ లోకి తీసుకొచ్చే విషయమై టీటీడీపీ నేతలకు ఆయన పలు సలహాలు-సూచనలు చేసినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే.. సోమవారం నాడు టీటీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు అధినేత చంద్రబాబుతో సమావేశమై తెలంగాణలో పార్టీ పరిస్థితి గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ నేతలకు పలు సూచనలు చేసిన చంద్రబాబు పార్టీని బలోపేతం చేసే దిశగా నేతలు కృషి చేయాలని చెప్పారు.
ఇందుకోసం దృష్టిలోకి వచ్చే ఏ ప్రజా సమస్యకైనా సరే టీటీడీపీ నేతలు ముందుండి పోరాడాలని ఆయన సూచించారు. అలాగే జనాల్లో పార్టీ అభిప్రాయం మార్చేందుకు, తనపై అధికార పార్టీ చేస్తోన్న దుష్ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లాలని చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, హైకోర్టు విభజన వంటి అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం తనపై దుష్ప్రచారం చేస్తోందని టీటీడీపీ నేతలకు వివరించారు చంద్రబాబు.
అలాగే టీడీపీ నేతల వ్యవహారమంతా టీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తున్నట్టుగానే సాగుతుందని టీటీడీపీ నేతలతో చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. హైకోర్టు విభజనకు సంబంధించి ఏపీకి మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుని విభజన చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్టు వెల్లడించారు.
ఇక తాను ఏపీకే పరిమితమవ్వాలని నిర్ణయించుకుంటే, ఆ పని ఎప్పుడో చేసుండేవాడినని, రెండు తెలుగు రాష్ట్రాలను సమానంగా భావిస్తున్నాను గనుకే సమన్యాయం గురించి కేంద్రానికి విన్నవించినట్టు తెలిపారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి ప్రస్తావిస్తే.. తెలంగాణ ఇస్తే, టీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తామన్నారని, కానీ ఇప్పుడదే కాంగ్రెస్ టీఆర్ఎస్ లో విలీనమయ్యే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఎద్దేవా చేసినట్టు సమాచారం.
భేటీలో భాగంగా తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరగ్గా.. తెలంగాణలో పార్టీ బలోపేతానికి స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేయాలని, ఇందుకోసం నేతలంతా కలిసి కట్టుగా పనిచేయాలని టీటీడీపీ నేతలకు చంద్రబాబు సలహా ఇచ్చారని తెలుస్తోంది.
ముద్రగడతో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భేటీ..
ఐదో రోజు దీక్ష కొనసాగిస్తోన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను కలిశారు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన చర్చలతోనే సానుకూల వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకోవాలని ముద్రగడకు వివరించినట్టు చెప్పుకొచ్చారు. ఇందుకోసం ప్రయత్నాలను మొదలుపెట్టాలని గవర్నర్ ని కోరబోతున్నట్టు తెలిపారు.
ఇక తుని ఘటనకు సంబంధించిన అరెస్టుల గురించి స్పందిస్తూ.. కేసులు నమోదైన తర్వాత తొలగించడమనేది సీఎం చేతిలో లేని విషయమని అన్నారు. దీనికోసం న్యాయ నిపుణులను సంప్రదించి నిజాలను చెప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలియజేశారు.