ఏపీకి బిల్గేట్స్ వస్తున్నారు, అందుకే, ఆ పథకాలు తీసేస్తా: చంద్రబాబు
అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. ఆయన రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.
హైదరాబాద్: అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. ఆయన రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వం పట్ల ప్రస్తుతం ఉన్న సంతృప్తి శాతం పెరగాలని చంద్రబాబు అన్నారు. ఇది 80 శాతం పెరగాలని ఆకాంక్షించారు. సంక్షేమ పథకాలు అందరికీ చేరాలన్నారు.
పనికిరాకుంటే తీసేస్తా: బాబు కీలక వ్యాఖ్యలు, రాజధానిలో పర్యటించిన రాజమౌళి
ఏపీకి బిల్ గేట్స్
ఏపీకి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ వస్తున్నారని చంద్రబాబు తొలిరోజు వెల్లడించారు. వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న సాంకేతిక అంశాలను మిలిండా గేట్స్ సంస్థ పరిశీలించనుందని వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం రాష్ట్రంలో భూసార పరీక్షలు తెలుసుకోవడానికి సాంకేతికతను పెద్దఎత్తున అమలు చేస్తోంది. బిల్గేట్స్ డిసెంబరులో రాష్ట్రానికి వచ్చి ఇవన్నీ పరిశీలిస్తారు. ఈ సందర్భంగా ఇక్కడ ఒక అంతర్జాతీయ సదస్సు కూడా నిర్వహించే అవకాశాలున్నాయి.
అందుకే ఆ జిల్లాలు వెనుకబడ్డాయి
ఆర్థికాభివృద్ధి, తలసరి ఆదాయాల్లో వెనుకబడిన జిల్లాల గురించి చంద్రబాబు బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో తక్కువ మట్టంలోనే భూగర్భ జలాలు లభిస్తున్నాయని, నదులు, తీరప్రాంతం, మంచి జాతీయ రహదారి ఉందని, ఇన్ని వనరులు ఉండీ ఆ జిల్లా వెనుకబడి పోయిందంటే అర్థమేమిటని, అక్కడ నాయకత్వం, పాలన వైఫల్యం చెందడమేనని, మిగిలిన మూడు జిల్లాల వెనుకబాటుకూ ఇదే కారణం అన్నారు.
ఆ పథకాలు ఉన్నాయో లేవో తెలియదు
ప్రభుత్వంలోని కొన్ని శాఖలు ఎందుకు ఉన్నాయో తెలియడం లేదని, అర్థం కావడం లేదని చంద్రబాబు అన్నారు. అలాంటి శాఖలను రద్దు చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. కొన్ని చిన్న చిన్న పథకాలున్నాయని, అవి ఉన్నాయో లేవో కూడా చాలామందికి తెలియదని, వాటికి స్వస్తి చెబుతామన్నారు. మారుతున్న కాలనుగుణంగా, సాంకేతిక అవసరాల దృష్ట్యా కొత్త శాఖల ఏర్పాటు అవసరమన్నారు. కొన్ని చట్టాలను కూడా పునసమీక్షించాలన్నారు.
సంతృప్తి పెరగాలి
ప్రస్తుతం ప్రభుత్వ పనితీరుపై 58 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చంద్రబాబు చెప్పారు. దానిని 80 శాతం సాధించాల్సిన అవసరముందన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రాష్ట్రంలో 11.72 శాతం వృద్ధి రేటు సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. దానికి కృషి చేసిన అధికారులను ఆయన అభినందించారు.
ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం
మనందరి భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడేలా చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. మూడేళ్లలో 13 సార్లు కలెక్టర్ల సదస్సులు నిర్వహించి ప్రజలకు అవసరమైన సేవలు, సమస్యలు, పథకాలు, కార్యక్రమాల గురించి తగు నిర్ణయాలు తీసుకున్నామని, రూ.వేల కోట్ల లోటున్నా రూ.24వేల కోట్ల వరకు రైతులకు రుణాలు మాఫీ చేసి ఉపశమనం కల్పించామని, మూడో విడత కూడా రుణమాఫీకి ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు.