బ్రాహ్మణులంటే చంద్రబాబుకు లెక్కలేదు:ఎమ్మెల్యే కోన రఘుపతి;ఇక జగన్ వరుస సమావేశాలు..ఎమ్మెల్యే కోన
విశాఖపట్నం:చంద్రబాబు ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయని, ఈ ప్రభుత్వ పోకడ చూస్తుంటే చంద్రబాబుకు బ్రాహ్మణులంటే లెక్కేలేదని అర్థమవుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి అభిప్రాయపడ్డారు.
విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐవైఆర్ కృష్ణారావు లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారిని బయటకు పంపించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వంలోనే చూశామన్నారు. రమణ దీక్షితులు లాంటి ఆగమ శాస్త్ర పండితులను కూడా టిడిపి ప్రభుత్వం అన్యాయంగా బయటకు పంపించిందని కోన విమర్శించారు. చంద్రబాబు దయవల్ల ఈ రోజు ఎన్నికల్లోకి క్యాష్, కాస్ట్ ఉంటేనే రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని కోన ఆవేదన వ్యక్తంచేశారు.
ఆదివారం మధ్యాహ్నాం 2 గంటలకు సిరిపురం విజ్ఞాన్ స్కూల్ గ్రౌండ్స్లో బ్రాహ్మణ సంఘాల ఆత్మీయ సమావేశం ఉంటుందని, దీనికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరవుతారని కోన రఘుపతి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం అభివృద్ధికి వైఎస్సార్సీపీ చేయబోయే అంశాల మీద ఈ సమావేశంలో చర్చించనున్నట్లు కోన తెలిపారు.
మరోవైపు ఎపి ప్రతిపక్షనేత, వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పర్యటన ఈ నెల 16 వ తేదీన విజయనగరంలోకి ప్రవేశించనుందని తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, తదితర అంశాలపై చర్చించేందుకు పలు సంఘాలు, న్యాయవాదులు, పార్టీ కార్యకర్తలతో వైఎస్ జగన్ వరుస భేటిలు ఉంటాయని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు.
తొలుత ఈ నెల 10న సిరిపురం విజ్ఞాన్ గ్రౌండ్లో బ్రాహ్మణులతో ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని వెల్లడించారు. అదే విధంగా జగన్ అధ్యక్షతలోనే ఈ నెల11న వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు సమావేశం ఉంటుందని చెప్పారు. ఈ సమావేశానికి 175 అసెంబ్లీ, 25 పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, కో ఆర్డినేటర్లు హాజరవుతారని తెలిపారు. ఈ నెల 12న అరిలోవ బీఆర్టీఎస్ రోడ్డులో ముస్లింలతో వైఎస్ జగన్ ఆత్మీయ సమావేశం ఉంటుందన్నారు. అదేవిధంగా ఈ నెల 15న న్యాయవాదులు వైఎస్ జగన్ను కలవనున్నారని ఎంపి విజయసాయి వెల్లడించారు.