చంద్రబాబుది శవ రాజకీయం.. ద్రోహిలా కనిపించిన కాంగ్రెస్ ఇప్పుడెలా నచ్చుతోంది?: బిజెపి నేతల ధ్వజం
తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి చంద్రబాబుది శవ రాజకీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. ఎర్రకాలవ ముంపు వల్ల వేలాదిమంది పంటలు నష్టపోయి,ఉపాధి కోల్పోయి గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు కేంద్రంపై చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని కన్నా దుయ్యబట్టారు.
ఎర్రకాలువ ముంపు వల్ల నష్టం జరిగిన గ్రామాల్లో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, బీజేపీ నాయకుల బృందంతో కలిసి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేరళకు కేంద్రం సాయం చేస్తే చంద్రబాబు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. శవ రాజకీయాలు అంటే ఇవేనని కన్నా అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్రకాలవ ముంపు ప్రాంతాల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో భాజపా నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ ఎర్రకాలవ వల్ల 20 వేల ఎకరాలు మునిగాయని, 15 నుంచి 20 గ్రామాల వరకు జలమయమయ్యాయని...అయినా ఇప్పటి వరకు సీఎం గానీ, మంత్రులు గానీ ఆయా గ్రామాలకు వెళ్లి అక్కడవాళ్లని ఓదార్చలేదని...అసలు కనీసం కనీసం పలకరించలేదని అన్నారు.
10 రోజులుగా రైతులు, కూలీలకు ఉపాధి లేక అవస్థలు పడుతున్నారని, వారికి ప్రభుత్వం ఎలాంటి తక్షణ సాయం అందించలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజలు వరద ముంపుకు గురై అవస్థలు పడుతుంటే ఇక్కడి ప్రజలను గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని కన్నా ధ్వజమెత్తారు. శవరాజకీయాలు అంటే ఇవేనని విమర్శించారు.
మరోవైపు బిజెపి మహిళా నేత పురంధేశ్వరి మరోసారి టిడిపి పై తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం ఆమె గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ద్రోహిలా కనిపించిన కాంగ్రెస్... ఇప్పుడు ఎలా నచ్చుతుందని తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారు. అసలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ ఇప్పుడు ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటుందని నిలదీశారు. ఎన్టీఆర్ కుమార్తెగా కాంగ్రెస్-టీడీపీ పొత్తును తాను వ్యతిరేకిస్తానన్నారు.
Recommended Video
కాంగ్రెస్-టిడిపి పొత్తును మిగతా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎలా స్వాగతిస్తారో చూడాలని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ అభిమానులు కూడా కాంగ్రెస్-టీడీపీ పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్తో పొత్తుపై తెలుగుదేశం పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు.