20 ఎమ్మెల్యేలు వద్దు.. బినామీల పేరుతో ఉన్న లక్ష కోట్లే ముద్దు.. చంద్రబాబుపై సాయిరెడ్డి అటాక్..
అమరావతిని రాజధానిగా ప్రకటించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలా చేస్తే తమ 20 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారని బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే దీనిపై వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి తనదైనశైలిలో స్పందించారు. చంద్రబాబు నాయుడుకి ఏదీ ముఖ్యమో తెలుసు కదా అంటూ ట్వీట్ చేశారు. ఎమ్మెల్యేలు, పదవుల కన్నా.. అంటూ మండిపడ్డారు.
అమరావతి పేరులోనే సాధికారత, అంగుళం కూడా కదల్చలేరు, మడమ తిప్పి: టీడీపీ అనిత
చంద్రబాబు మరో ఆఫర్
బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపడంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాజధాని మార్పుపై జగన్ ప్రభుత్వం కచ్చితంగా ఉండటంతో.. అసెంబ్లీని రద్దు చేయాలని 48 గంటల గడువు కూడా ఇచ్చారు. ఇందుకు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో అమరావతికే కట్టుబడి ఉంటామని ప్రకటన చేయాలని కోరారు. అలా చేస్తే తమ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని తెలిపారు. దీంతో మీరే పదవుల్లో ఉండొచ్చని చెప్పారు. దీనిపై విజయసాయిరెడ్డి స్పందించారు.
ప్రయోజనాలే ముఖ్యం..
చంద్రబాబుకు ఎప్పుడూ తన స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు బినామీల పేర్లతో భూములు కొన్నారని ఆరోపించారు. దాని విలువ రూ.లక్ష కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు 20 మంది ఎమ్మెల్యేలను ఫణంగా పెడుతున్నారని ఆరోపించారు. ఇందులో బాబు స్వలాభం తప్ప మరోటి లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
20 మంది ఎమ్మెల్యేలు కావాలా.. భూమలు కావాలా...
చంద్రబాబును మీకు 20 మంది ఎమ్మెల్యేలు కావాలా.. లేదంటే రాజధానిలో బినామీల పేరుతో రూ.లక్ష కోట్ల విలువ గల భూములు కావాలని అడిగితే.. మరో ఆలోచన లేకుండా భూములే కావాలని అడుగుతారని పేర్కొన్నారు. దీనిని బట్టి ఆయన భూములకు ఇచ్చే విలువ ఏంటో అర్థమవుతోందన్నారు. అమరావతి అంటే బాబు దృష్టిలో భూములేనని.. మరొటి కాదన్నారు. దీనినిబట్టి అమరావతికి బాబు ఇచ్చే విలువ ఏంటో అందరికీ తెలుస్తుందన్నారు.
Recommended Video
అమరావతికి ఇచ్చే విలువ ఇదే..
ఏపీలో రాజధాని వికేంద్రీకరణ చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తుంటే.. అందుకు టీడీపీ మోకాలడ్డుతోంది. రాజధాని రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు. గవర్నర్ ఆమోదం తెలిపిన బిల్లులపై హైకోర్టు స్టేటస్ కోతో.. వైసీపీపై విమర్శలకు టీడీపీ మరింత పదును పెట్టింది. అందులోభాగంగానే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళదామని చంద్రబాబు సవాల్ విసిరారు. 48 గంటల సమయం కూడా ఇవ్వగా.. వైసీపీ నుంచి స్పందన రాలేదు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం 23 సీట్లు గెలిచిన చంద్రబాబు సవాల్ స్వీకరించాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు. మరోసారి చంద్రబాబు నాయుడు అమరావతికి ఇచ్చే విలువ ఇదేనని ట్వీట్లో కామెంట్ చేశారు.