సిగ్గుంటే.. ఆ పని చెయ్, రాజకీయాల నుంచే తప్పుకుంటా!: జలీల్ఖాన్కు సవాల్
విజయవాడ: ఏపీ మంత్రుల రౌడీయిజానికి సీఎం చంద్రబాబు కొమ్ము కాస్తున్నారని విజయవాడ వైసీపీ అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. టీడీపీ నేతలు బోండా ఉమ, కేశినేని నాని, బుద్దా వెంకన్న, జలీల్ఖాన్, చింతమనేని ప్రభాకర్ రౌడీయిజంతో రెచ్చిపోతున్నా చంద్రబాబు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.
టీడీపీ నాయకులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని, ఎమ్మెల్యే జలీల్ఖాన్ మద్యం తాగి రోడ్లపైకి వచ్చి దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు. వైసీపీ టికెట్ మీద గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన జలీల్ ఖాన్ ఎప్పుడో ప్రజల విశ్వాసం కోల్పోయారని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఓ సవాల్ కూడా విసిరారు.
''సిగ్గుంటే.. వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్.. టీడీపీ నుంచి నువ్వు, వైసీపీ తరుపున నేను పోటీ చేద్దాం. నీకు డిపాజిట్టు కూడా రావు. ఒకవేళ డిపాజిట్ వస్తే.. నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా' అని సవాల్ విసిరారు. వైసీపీ నాయకులు చటర్జీ, దుర్గాలపై జలీల్ఖాన్ బెదిరింపులకు దిగుతున్నాడని, వాళ్లకి జరగరానిదేమైనా జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
టీడీపీ నాయకులు చేసే రౌడీయిజానికి వైసీపీ భయపడదని వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. జలీల్ ఇష్టారీతిన వ్యవహరిస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఇక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురించి ప్రస్తావిస్తూ.. ఒక ఆర్టీసి కండక్టర్ పై చింతమనేని దాడి చేసినా.. పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. కనీసం ఉద్యోగ సంఘాలైనా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.