స్లమ్ సిటీ కోసమైతే ఎక్కడికో ఎందుకు?, నా పేరు వింటే హైదరాబాద్.. : చంద్రబాబు
విజయవాడ : రష్యా పర్యటన అనంతరం విజయవాడలో అడుగుపెట్టిన ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం నాడు క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా పర్యటన వివరాలను వెల్లడించిన చంద్రబాబు, విదేశీ టూర్లతో ప్రజాధనాన్ని దుర్వినియోగమే చేయడమే కాకుండా, ఏ దేశం వెళితే ఆ దేశాల్లాగా రాజధానిని నిర్మాణం చేపడుతామంటూ గొప్పలు పోతున్నారని తనపై వస్తోన్న ఆరోపణలను ఖండించారు.
సమావేశం సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ అత్యత్తుమ నగరంగా రాజధానిని తీర్చి దిద్దాలనే ఉద్దేశంతోనే తాను రష్యాలో పర్యటించినట్టు చెప్పారు. సింగపూర్ కి వెళితే సింగపూర్ కడుతానని, ఆస్థానా పర్యటనకు వెళితే ఆస్థానా కడుతానని ఆయా పేపర్లలో వార్తలు రాయడం విలేఖరుల అవగాహన లేనితనంగా అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు.
భావి తరాలకు మరో స్లమ్ సిటీని అందించాలనే ఉద్దేశమే ఉంటే ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదని, మనవాళ్లతో కూర్చుంటే స్లమ్ ఇంకో స్లమ్ సిటీ తయారవుతుందని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ నగరంగా అమరావతిని చూడాలనుకుంటున్నాను కాబట్టే రష్యా పర్యటనకు వెళ్లి వచ్చినట్టు వెల్లడించారు. అలాగే గతంలో తాను సీఎంగా ఉన్న సమయంలో చేపట్టిన పలు నిర్మాణాల గురించి వివరించారు చంద్రబాబు.
హైదరాబాద్ లో విమానాశ్రయం కట్టడానికి పలుదేశాల విమానశ్రయాలు పరిశీలించిన మీదటే, అత్యుత్తుమ ఎయిర్ పోర్ట్ కట్టడానికి జీఎంఆర్ కు బాధ్యతలు అప్పగించానన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం నమూనాలు రూపొందించడానికి అమెరికాలో 15 రోజుల పాటు పర్యటించానన్నారు. ఇక హైటెక్ సిటీ నిర్మించ తలపెట్టినప్పుడు ఎల్ అండ్ టీ కంపెనీతో ఏకంగా 20 సార్లు డిజైన్లు మార్పించానని తెలిపారు.
ఇదే క్రమంలో అమరావతి నిర్మాణానికి సంబంధించిన డిజైన్ల కోసం పోటీ నిర్వహిస్తే.. ఒక ఆర్కిటెక్ట్ వచ్చి డిజైన్ చూపించాడని, అయితే అది సంతృప్తికరంగా అనిపించలేదన్నారు చంద్రబాబు. అందుకే మరిన్ని అత్యుత్తమ నమూనాల కోసం పలువురిని సంప్రదిస్తున్నామని పేర్కొన్న ఆయన ఇంతవరకు ఆర్కిటెక్ట్ లు భవనాలను నిర్మించారే తప్ప నగరాన్ని నిర్మించిన దాఖలా లేదన్నారు.
తాజా విదేశీ పర్యటన గురించి :
విదేశీ పర్యటనల సందర్భంగా.. తనను చూస్తే హైదరాబాద్ నగరం గుర్తుకొస్తుందని చాలామంది తనతో చెబుతున్నట్టుగా తెలిపారు సీఎం చంద్రబాబు. అమరావతి బాధ్యత తనపై ఉందని వారు గుర్తు చేస్తుండడంతో రష్యా, కజకిస్తాన్ లాంటి దేశాల్లో పర్యటించానన్నారు. పర్యటనలో భాగంగా రష్యాతో రెండు కీలక ఒప్పందాలు చేసుకున్నట్టు చెప్పిన ఆయన, ప్రపంచంలో ఎక్కడా లేని ప్యాలెస్ లు రష్యాలో ఉన్నాయన్నారు.
రష్యా ప్రధానితో భేటీలో భాగంగా.. మొత్తం ముగ్గురు ముఖ్యమంత్రులం సమావేశమయ్యామని, రెండు దేశాల మధ్య సంబంధాలను ఢిల్లీ మాస్కోలకే పరిమితం చేయకుండా కంపెనీల విస్తరణ జరగాలని కోరినట్టు తెలిపారు. తన ఆహ్వానం మేరకు రష్యా ప్రధాని అమరావతికి రావడానికి అంగీకరించినట్టుగా వెల్లడించారు.
ఇక కజకిస్తాన్ పర్యటన గురించి ప్రస్తావిస్తూ.. 18 ఏళ్ల కాలంలోనే ఆస్థానాను అక్కడి పాలకులు అద్భుత నగరంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. అయితే ఇక్కడ తప్పులు జరిగినట్టే గానే అక్కడ కూడా పొరపాట్లు దొర్లాయని, వాటిని సరిచేసుకునేందుకు కజకిస్తాన్ తరుపున ఐదుగురు, ఏపీ తరుపున ఐదుగురితో కూడిన ఏర్పాటు చేసినట్టుగా తెలియజేశారు. అలాగే రక్షణ సామాగ్రిని భారత్ కు భారీగా ఎగుమతి చేసే రష్యాతో ఏపీలో యూనిట్ లు ప్రారంభించాలని కోరినట్టుగా చెప్పుకొచ్చారు. చివరగా, ఏపీని డిఫెన్స్ ఏరోస్పేస్ హబ్ గా తీర్చిదిద్దడమే తన ధ్యేయమన్నారు సీఎం చంద్రబాబు.