యూస్లెస్ ఫెల్లో వ్యాఖ్యలు: గంటాపై మండిపడ్డ చంద్రబాబు
విజయవాడ: కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య చేసిన విమర్శలపై ఎందుకు స్పందించలేదని మంత్రి గంటా శ్రీనివాసరావుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడినట్లు తెలుస్తోంది. చంద్రబాబు... ఒక యూస్ లెస్ చీఫ్ మినిస్టర్ అని సి. రామచంద్రయ్య మంగళవారంనాడు వ్యాఖ్యానించారు. దానిపై గంటా స్పందించకపోవడంపై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోది.
ముఖ్మయంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ మంత్రులతో విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సాక్షి పత్రికలో "రాజధాని దురాక్రమణ" అంటూ వచ్చిన కథనాల గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సరిగ్గా స్పందించకపోవడంపై కూడా బాబు మండిపడినట్లు చెబుతున్నారు.
ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కోవడంలో విఫలమయ్యారని ఇతర మంత్రులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారట. కాపునేత ముద్రగడ పద్మనాభం లేఖపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ముద్రగడ విమర్శలకు ధీటుగా ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని కాపు నాయకులను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ముద్రగడ లేఖ వెనుక జగన్ హస్తం ఉందని సమావేశంలో చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. ముద్రగడ, మందకృష్ణ చెప్పినట్టు ప్రభుత్వం నడవదని, తమకంటూ ఒక విధానం ఉందని చంద్రబాబు సమావేశంలో అసహనం వ్యక్తం చేశారు.