కరుణానిధి శకంగా మిగిలిపోతుంది: చంద్రబాబు దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం
అమరావతి: తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మృతిపట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
రాజకీయ యోధుడిని దేశం కోల్పోయిందన్నారు. అటు సాహిత్య రంగం, చలన చిత్ర రంగం, పత్రికా రంగం, రాజకీయ రంగంలో ఘనాపాఠి అని, తన సేవాభావం, పాలనా అనుభవంతో తమిళ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు.
డిఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతికి నా ప్రగాఢ సంతాపం. తాను నమ్మిన సిద్ధాంతాలను నిజ జీవితంలో ఆచరించిన ఆయన జీవిత కాలం తమిళనాట కరుణానిధి శకంగా మిగిలిపోతుంది. కరుణానిధి కుటుంబ సభ్యులకు, డిఎంకె కార్యకర్తలకు, తమిళ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి.
— N Chandrababu Naidu (@ncbn) August 7, 2018
రచయితగా, కళాకారునిగా, పత్రికా సంపాదకునిగా, రాజకీయ వేత్తగా, పరిపాలకుడిగా చెరగని ముద్రవేశారన్నారు. కరుణానిధి మృతి తమిళనాడుకే కాదు భారతదేశానికే తీరనిలోటన్నారు. నిరుపేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరితపించారని అన్నారు.
కరుణానిధి మృతి తమిళనాడుకే కాదు యావత్ భారతదేశానికే తీరనిలోటు. నిరుపేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన నిత్యం పరితపించారు. 5 సార్లు ముఖ్యమంత్రిగా, 13సార్లు శాసనసభ్యునిగా, 50 ఏళ్ళు పార్టీ అధ్యక్షునిగా 75 ఏళ్ల ఆయన రాజకీయ జీవితం అందరికీ ఆదర్శం, మార్గదర్శకం.
— N Chandrababu Naidu (@ncbn) August 7, 2018
5 సార్లు ముఖ్యమంత్రిగా, 13 సార్లు శాసనసభ్యునిగా, 50 ఏళ్ళు పార్టీ అధ్యక్షునిగా, 75 ఏళ్ల రాజకీయ జీవితం అందరికీ ఆదర్శం, మార్గదర్శకం.. అని పేర్కొన్నారు. తాను నమ్మిన ద్రవిడ సిద్దాంతాలను ముందుకు తీసుకెళ్లారని కీర్తించారు.ఆయన జీవిత కాలం తమిళనాట కరుణానిధి శకంగా మిగిలిపోతుందన్నారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు, డిఎంకె కార్యకర్తలకు, తమిళ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.