సీమాంధ్రరాజధాని చంద్రబాబు చేతిలో, మదిలో బెజవాడ!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు.. ప్రధాని కాబోతున్న నరేంద్ర మోడీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) కొత్త రాజధాని నిర్మాణం చేయనున్నారు. సీమాంధ్ర రాజధాని విషయమై ఇప్పటికే కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ విశాఖ, గుంటూరు - విజయవాడ.. తదితర ప్రాంతాలను పరిశీలించిన విషయం తెలిసిందే. కమిటీ సూచనల మేరకు అనువైన ప్రాంతాన్ని కేంద్రం రాజధానిగా చేయనుంది. కొత్త రాజధాని నిర్మాణంలో మోడీ, చంద్రబాబుల పాత్ర ఉండనుంది. చంద్రబాబు పాత్ర మరింత కీలకంగా మారనుంది.
కొత్త ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక విషయంలో చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయంలో చంద్రబాబు ఆచితూచి స్పందిస్తున్నారు. శనివారం ఒక ఇంగ్లీషు చానల్ కొత్త రాజధాని విషయమై చంద్రబాబుపై ప్రశ్నించింది. బాబు మాత్రం ఎక్కడ తొణకకుండా, తన మదిలో భావాలు తెలియచేయకుండా జాగ్రత్త పడ్డారు. కొత్త రాజధాని విడయవాడలోనే మరెక్కడైనా పెడతారా అని ప్రశ్నిస్తే... రాజధాని విషయమై బహిరంగ చర్చ పెట్టి, ప్రజల నుండి అభిప్రాయం తీసుకొని ఆ మేరకు నడుచుకుంటామని చెప్పారు.
కొత్త రాజధాని ఎంపికపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన కమిటీ ఇప్పటికే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు నగరాల్లో పర్యటించింది. మరో విడతలో ప్రకాశం, కర్నూలు, తిరుపతి నగరాల్లో పర్యటించనుంది. ఈ కమిటీ నివేదిక సంగతి ఎలా ఉన్నా, ఆలోగానే రాజధానిపై బహిరంగ చర్చ నిర్వహించి ప్రదేశాన్ని ఖరారు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారట. రాజధాని కమిటీకి చట్టబద్ధత ఉన్నా, మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఈ కమిటీ నివేదికకు ఉన్న ప్రాధాన్యత ప్రశ్నార్థకమనే చెప్పవచ్చు.
ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజలు అండదండల వల్ల అధికారానికి చేరువైన చంద్రబాబుపై గోదావరి నదీ తీరంలో ఉన్న రాజమండ్రిలో రాజధానిని ఏర్పాటు చేయాలనే ఒత్తిడి ప్రారంభమైనట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం రాజధాని ఎంపికలో బిజెపి కూడా ముఖ్య పాత్ర పోషించనుంది. రాజధానిని ఆంధ్రా జిల్లాల్లో ఏర్పాటు చేస్తే.. రాయలసీమవాసులను సంతృప్తిపరిచేందుకు అనంతపురంలో నాగపూర్ (మహారాష్ట్ర), జమ్ము (జమ్ముకాశ్మీర్), బెల్గాం (కర్నాటక) తరహాలో రెండవ రాజధానిని ఏర్పాటు చేయాలనే యోచనలో టిడిపి ఉంది.
గుంటూరు జిల్లా మంగళగిరి, అమరావతి పరిసరాల్లో రాజధానిని ప్రకటించాలనే వత్తిడి అప్పుడే ప్రారంభమైందట. టిడిపి నేతల సంభాషణల్లో రాజధాని అంశంపై జోరుగా చర్చ సాగుతోందట. రాజధాని కమిటీ నివేదికను ఆగస్టు 31లోగా ఇవ్వాల్సి ఉంది. మరో మూడు నెలలు కాలపహరణం చేయడం తగదనే అభిప్రాయంతో టిడిపి నేతలు ఉన్నారు. వచ్చే ఎన్నికల (2019) నాటికి సీమాంధ్రలోనే రాజధాని ఉండాలనే గట్టి పట్టుదలతో చంద్రబాబు ఉన్నారని సమాచారం. కేంద్రం పదేళ్ల సమయం ఇచ్చినా ఎంత త్వరగా వెళ్తే అంత అభివృద్ధికి ఆస్కారమని టిడిపి నేతలు భావిస్తున్నారు.
గుంటూరు - విజయవాడ అనుకూలం!
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడ - గుంటూరు చాలా అనుకూలమనే వాదన చాలా రోజులుగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు విజయవాడలోనే ప్రయాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నారు. గుంటూరులో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి అక్కడి నుంచి వారంలో మూడు రోజుల పాటు పరిపాలన నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.
విజయవాడ - గుంటూరు సీమాంధ్రలోని అన్ని ప్రాంతాలకు దాదాపు సమానం దూరంలో ఉంటుంది. విజయవాడ - గుంటూరు అనుకూలంగా ఉందనే వాదనలు, చంద్రబాబు అక్కడే ప్రమాణం చేయాలని, గుంటూరులో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అక్కడే రాజధాని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయా అనే చర్చ సాగుతోంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి పరిసరాల్లో రాజధాని ఏర్పాటు చేయాలని బాబు భావిస్తున్నారట!