బాబుకు రాజధాని చిక్కు: పవన్ కళ్యాణ్ నుంచి జగన్ వరకు, కోర్టుకైనా
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి భూసేకరణ కోసం ప్రభుత్వం విడుదల చేసిన భూసేకరణ చట్టం ఇబ్బందులు తెస్తోంది. దీనిని విపక్షాలతో పాటు గత సార్వత్రిక ఎన్నికల్లో మద్దతు పలికిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా విభేదిస్తున్నారు.
రాజధాని కోసం పచ్చని పంటపొలాలను తీసుకోవద్దని, రైతులను ఒప్పించి తీసుకోవాలని విపక్షాలు, జనసేన డిమాండ్ చేస్తోంది. బలవంతంగా భూములు తీసుకుంటే మాత్రం ఊరుకునేది లేదని, కోర్టుకు కూడా వెళ్తామని హెచ్చరిస్తున్నారు.
పోటాపోటీ నిరసనలు
రాజధాని ప్రాంతంలో రాజధాని భూసేకరణ వ్యతిరేక, అనుకూల రైతులు శుక్రవారం నాడు పోటాపోటీగా నిరసనలకు దిగారు. కొందరు రైతులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మరికొందరు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాజధాని కోసం 95 శాతం భూమిని సేకరించారని, మిగతా కొద్ది దాని కోసం రాజకీయం చేయవద్దని ప్రభుత్వం, మంత్రులు, టిడిపి నేతలు కోరుతున్నారు. అవసరమైతే రాజధాని ప్రాంతానికి వచ్చి మెజార్టీ రైతుల అభిప్రాయం తీసుకోవాలని పవన్ కళ్యాణ్, ఇతర విపక్ష నేతలకు మంత్రులు సూచించారు.
చంద్రబాబు అత్యవసర సమావేశం
రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ)పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.
భూసమీకరణ అనంతరం సేకరించాల్సిన మూడువేల ఎకరాలపై విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్పై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు.
రైతు వ్యతిరేకి: వైసిపి
చంద్రబాబు రైతు వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకున్నారని వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. రైతుల విషయంలో రాబోయే రోజుల్లో చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో రాజధాని ప్రాంత రైతుల భూమిని దోపిడీ చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. రైతు వ్యతిరేకులను కోర్టుకెక్కిస్తామన్నారు.
కాగా, రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం భూసేకరణ ముసాయిదా నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. రాజధాని పరిధిలో మొత్తం 3,892 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.
రాజధాని పరిధిలో 29 గ్రామాలు ఉండగా ఇవాళ తుళ్లూరు మండల పరిధిలోని పిచుకలపాలెం, బోరుపాలెం, అనంతవరం, అబ్బురాజుపాలెం, తుళ్లూరు-2 గ్రామాలకు సంబంధించి 11.04 ఎకరాలకు భూసేకరణ ముసాయిదా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. మిగిలిన 24 గ్రామాలకు సంబంధించి శనివారం నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.