జగన్ చిన్నోడైనా, తెలంగాణ తెచ్చినంత తేలేదు: బాబుపై లక్ష్మీపార్వతి
గుంటూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి సోమవారం మండిపడ్డారు. మోసపూరిత హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. చిన్నవాడైనప్పటికీ రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు, దీక్షలతో జగన్ ముందుకెళ్తున్నారన్నారు.
ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని విస్మరిస్తారా అని మండిపడ్డారు. అందుకే ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారా అన్నారు. మహాత్మా గాంధీ మార్గాన్ని జగన్ అనుసరిస్తున్నారన్నారు. జగన్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను అవమానపర్చడం విడ్డూరమని మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ దీక్ష పైన, ఆయన ఆరోగ్యం పైన మంత్రులు పత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాస రావు, కామినేని శ్రీనివాస్ రావులు చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. వారి చరిత్ర ప్రజలకు తెలుసన్నారు.
నాడు రాజ్యసభలో పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కావాలని పట్టుబట్టిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఇప్పుడు ఆ సంగతే మర్చిపోయారన్నారు. కేంద్రం నుంచి ఏపీకి ఇప్పటి వరకు రూ.4,200 కోట్లు మాత్రమే వచ్చాయని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం రూ.5,145 కోట్లను సాధించుకుందన్నారు.
జగన్ దీక్షకు మద్దతు పలికిన హర్ష కుమార్
ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్న జగన్కు క్రమంగా మద్దతు పెరుగుతోంది. జగన్ నిరవధిక దీక్షకు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మద్దతు పలికారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైసిపి శ్రేణులు దీక్ష చేపట్టిన శిబిరాన్ని ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడారు. జగన్ చేపట్టిన నిరాహార దీక్ష చాలా గొప్పదన్నారు. స్వార్థం కోసం జగన్ దీక్ష చేపట్టలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించాలనే తపనతోనే జగన్ దీక్ష చేస్తున్నారని, అన్ని పార్టీలు కలసికట్టుగా ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.