చంద్రబాబుకు రాయలసీమ పౌరుషమే ఉంటే...: తమ్మినేని
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబుకు రాయలసీమ పౌరుషమే ఉంటే పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులతో రాజీినామాలు చేయించాలని ఆయన సవాల్ విసిరారు.
చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఈ రోజు కేంద్రం వద్ద నిధుల కోసం మోకరిల్లాల్సిన పరిస్థితి ఉండేది కాదని ఆయన అన్నారు.
ఈ రోజు రాష్ట్రం లోటు బడ్జెట్తో ఉందని, కేంద్రం ఇచ్చిన నిధులు సరిపోవడం లేదని, కేంద్రాన్ని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన అన్నారు. ఎపిని చూస్తుంటే బాధగా ఉందని అన్నారు. టిడిపి పుట్టింది రాష్ట్ర హక్కుల కోసమని, కానీ చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని తమ్మినేని అన్నారు.
కేంద్రం నుంచి నిధులు తేవడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. అఖిల పక్షాన్ని సమావేశపరిచి ఢిల్లీకి ఎందుకు తీసుకుని వెళ్లడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక్క అఖిల పక్ష సమావేశమైనా ఏర్పాటు చేశారా అని అడిగారు. చంద్రబాబు ప్రతిపక్షాన్ని విశ్వాసంలోకి తీసుకోవడం లేదని తప్పు పట్టారు.
ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు జోడీ దొందూ దొందేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు స్కాంలు తగ్గించి, స్కీంలు పెంచాలని ఆయన సూచించారు. మదీనాగుడాలోని ఫామ్హౌస్ను ప్రజల డబ్బుతో చంద్రబాబు బాగు చేసుకోవచ్చునా అని ఆయన అడిగారు.