టీ-ఏపీ: ఓటు హక్కు మార్చుకున్న చంద్రబాబు ఫ్యామిలీ, పేలుతున్న జోకులు!
Recommended Video
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం అమరావతికి మకాం మార్చిన ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు తన ఓటు హక్కును కూడా ఏపీకి మార్చుకున్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లుగా ఉన్న చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబసభ్యులు.. ఇప్పుడు ఏపీలోని మంగళగిరి నియోజకవర్గానికి బదిలీ చేసుకున్నారు.
బాబుతోపాటు ఫ్యామిలీ..
చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణిలు కూడా తమ ఓటరు గుర్తింపును బదిలీ చేయించుకున్నారు. కృష్ణా నది ఉండవల్లి కరకట్ట వద్ద తాత్కాలిక అధికారిక నివాసం(ఇంటి నెం. 3-781-1)లో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న విషయం తెలిసిందే.
అధికారుల ధృవీకరణ
చంద్రబాబు నివాసం తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామపంచాయతీ పరిధిలోకి వస్తుండటంతో ఈ మేరకు దరఖాస్తు చేసుకోగా.. అధికారులు దర్యాప్తు చేసిన అనంతరం ధృవీకరించారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ చంద్రబాబు హైదరాబాద్లోనే తన ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే.
శభాష్ లోకేష్ అంటూ.. పేలుతున్న జోకులు
ఇది ఇలావుంటే కొత్తగా ఏపీలో ఓటర్లుగా చేరిన చంద్రబాబు కుటుంబంపై పలువురు సామాజిక మాధ్యమాల్లో జోకులు పేలుస్తున్నారు. ‘ఓటు హక్కు లేనోళ్లు కూడా ఇక్కడి సమస్యలపై మాట్లాడాతారా?' అని గతంలో ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ‘శభాష్ లోకేష్.. ఇప్పటికైనా రాష్ట్ర సమస్యలపై మాట్లాడే హక్కు సాధించావ్' అని చురకలంటిస్తున్నారు.
చివరి హక్కునూ వదులుకున్న బాబు
ఇక చంద్రబాబును ఉద్దేశించి కూడా పలువురు నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘తెలంగాణలో ఉన్న చివరి హక్కునూ వదులుకున్నారు' అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఓటుకు నోటు కేసు తర్వాతే చంద్రబాబు హైదరాబాద్ను వదిలేశారని, ఇప్పుడు ఓటు హక్కును కూడా వదిలేశారని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు.